ధన్యవాదాలు
ఇక్కడితో నేటి బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
యుక్రెయిన్ సరిహద్దులకు వందల కి.మీ. దూరంలోని ర్యజాన్ నగరంలోని రష్యా వైమానిక క్షేత్రాలపై యుక్రెయిన్ దాడిచేసినట్లు రష్యా మీడియా వెల్లడించింది.
ఇక్కడితో నేటి బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.
యుక్రెయిన్లోని భిన్న నగరాలపై రష్యా మరోసారి క్షిపణులతో దాడులు చేసింది.
జాపోరిఝియాలో జరిగిన దాడుల్లో ఇద్దరు పౌరులు మరణించినట్లు యుక్రెయిన్ అధికారులు తెలిపారు.
మరోవైపు ఒడెస్సాలో విద్యుత్ గ్రిడ్లు లక్ష్యంగా దాడులు జరిగాయని కూడా అధికారులు వెల్లడించారు.
యుక్రెయిన్ రాజధాని కీయెవ్లో భూగర్భ మెట్రో స్టేషన్లలో ప్రజలు తలదాచుకున్న ఫోటోలు ఆన్లైన్లో వైరల్ అయ్యాయి.
మరోవైపు యుక్రెయిన్ సరిహద్దులకు వందల కి.మీ. దూరంలోని ర్యజాన్ నగరంలోని రష్యా వైమానిక క్షేత్రాలపై యుక్రెయిన్ దాడిచేసినట్లు రష్యా మీడియా వెల్లడించింది.
జీ20 సదస్సు సన్నాహక సమావేశంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ పాల్గొంటున్నారు.
అయితే ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో వ్యక్తిగతంగా సమావేశం ఉండదని ఆమె తెలిపారు.
కమలం మన జాతీయ పుష్పం అయినప్పటికీ అది ఒక రాజకీయ పార్టీ లోగో కాబట్టి దాన్ని జీ20 లోగోగా పెట్టకూడదని మమతా బెనర్జీ అన్నారు.
‘పోలింగ్ రోజున రోడ్ షోలు చేపట్టకూడదు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన పార్టీ నేతలు వీవీఐపీలు. కాబట్టి వారు ఏమైనా చేయగలరు. వారికి మినహాయింపు లభిస్తుంది’ అని ఆమె విమర్శించారు.
బంగ్లాదేశ్తో జరిగిన తొలి వన్డేలో ఒక్క వికెట్ తేడాతో టీం ఇండియా ఓడిపోయింది.
భారత్ ఫీల్డింగ్ సరిగా లేక పోవడం వల్ల చివరి వికెట్ తీయలేక పోయిందే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా కీపర్ కేఎల్ రాహుల్ మీద సోషల్ మీడియాలో చాలా వ్యతిరేకత వచ్చింది.
బంగ్లాదేశ్ బ్యాటర్ మెహ్ది హసన్ ఇచ్చిన సింపుల్ క్యాచ్ను కేఎల్ రాహుల్ వదిలేశాడంటూ విమర్శిస్తున్నారు.
అయితే మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ మాత్రం కేఎల్ రాహుల్కు అండగా నిలబడ్డారు. టీం ఇండియా 186 పరుగులు మాత్రమే చేస్తే రాహుల్ ఏం చేయగలడు? అని ఆయన ప్రశ్నించారు.
‘మీరు కేఎల్ రాహుల్ మాత్రమే తప్పు పట్టకూడదు. చివరి వికెట్ చాలా ముఖ్యమే. తీసుంటే మ్యాచ్ అక్కడితే అయిపోయి ఉండేది. కానీ వాస్తవానికి భారత్ చేసింది 186 పరుగులు మాత్రమే. దీన్ని కూడా చూడాలి.
136 పరుగులకే 9 వికెట్లు తీయడం ద్వారా బౌలర్లు బాగానే కష్టపడ్డారు. ఆ తరువాత హసన్ మిరాజ్ క్రీజులోకి వచ్చాడు. అతనికి అదృష్టం కూడా కలిసొచ్చింది.
ఒకవేళ భారత్ 250 పరుగులు చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది’ అని సునీల్ గావస్కర్ అన్నారు.
సోషల్ మీడియాలో మరికొందరు కేఎల్ రాహుల్కు అండగా వస్తున్నారు. రాహుల్ 73 పరుగులు చేయకుంటే భారత్ స్కోరు 120 కూడా దాటేది కాదని కొందరు అంటున్నారు.
కర్నూలును ‘న్యాయ రాజధాని’గా ఉంచాలంటూ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నేడు ‘రాయల సీమ గర్జన’ పేరిట సభను నిర్వహిస్తున్నారు.
కర్నూలులోని ఎన్టీబీసీ కళాశాల మైదానంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. వెనుకబడిన రాయలసీమ ప్రాంతం అభివృద్ధి ధ్యేయంగా ఈ సభను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు.
అలాగే మూడు రాజధానులకు మద్దతుగా కూడా ఈ సభను నిర్వహిస్తున్నారు.
రాయలసీమలోని అన్ని జిల్లాల నుంచి ప్రజలు ఈ సభకు వచ్చారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఆంధ్రప్రదేశ్ మంత్రులు కూడా ఈ సభలో పాల్గొన్నారు.
బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్కు నేడు సింగపూర్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ జరుగుతోంది.
లాలు కూతురు రోహిణి ఆచార్య ఆయనకు కిడ్నీ ఇస్తున్నారు. కొంత కాలంగా లాలు ప్రసాద్ యాదవ్ అనారోగ్యంతో ఉన్నారు.
తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, సీబీఐకి లేఖ రాశారు. దిల్లీ లిక్కర్ ‘కుంభకోణాని’కి సంబంధించి నమోదైన ఎఫ్ఐఆర్లో తన పేరు లేదంటూ ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు.
అలాగే సీబీఐ అడిగినట్లుగా 6వ తేదీన అంటే రేపు విచారణకు తాను అందుబాటులో ఉండనని, ముందుగానే కొన్ని కార్యక్రమాలు షెడ్యూల్ అయి ఉండటమే ఇందుకు కారణమని ఆమె తెలిపారు.
ఈ నెల 11, 12, 14,15 తేదీల్లో తన నివాసంలో తాను విచారణకు అందుబాటులో ఉంటానని కవిత రాశారు.
దిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి విచారించాలంటూ కొద్ది రోజుల కిందట ఆమెకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సీబీఐ వెబ్సైట్లో ఉన్న ఎఫ్ఐఆర్ కాపీనీ చూసినట్లు కవిత తెలిపారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అహ్మదాబాద్లోని ఒక పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. రికార్డు స్థాయిలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
గుజరాత్ రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేడు జరుగుతోంది.
బాపట్ల జిల్లాలో రోడ్డు ప్రమాదం, అయ్యప్ప మాల ధారణలో ఉన్న నలుగురు భక్తులు మృతి
ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. నలుగురు ప్రయాణీకులు అక్కడిక్కడే మరణించారు. మరో 16 మంది గాయాలపాలయ్యారు
వేమూరు మండలం జంపని సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా నిలపూడి గ్రామానికి చెందిన అయ్యప్ప భక్తులు గుంటూరు జిల్లా తెనాలి వస్తుండగా మార్గం మధ్యలో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు.
ఉదయం మంచు దట్టంగా ఉండటం వల్ల ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో వారు ప్రయాణిస్తున్న టాటా ఏస్ వాహనం అదుపు తప్పిందని పోలీసులు చెబుతున్నారు.
నేడు దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జీ20 సదస్సు సన్నాహక సమావేశం జరగనుంది.
దేశంలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తోపాటు, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు పాల్గొంటున్నారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ నేడు మొదలైంది.
మొత్తం 14 జిల్లాలకు చెందిన 93 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. 2.5 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
గాంధీనగర్లోని రాజ్భవన్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఓటు వేయడానికి బయలు దేరారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్డేట్స్ కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.