You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

వరంగల్‌లో బీజేపీ మహా సంగ్రామ యాత్ర సభ: 'కరీంనగర్ జైల్లో కేసీఆర్‌కు రూమ్ రెడీ చేసి వచ్చిన' - బండి సంజయ్

కేసీఆర్ తెలంగాణ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ లాగా ప్రజలను నిర్బంధానికి గురి చేస్తున్నారని వరంగల్ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు.

లైవ్ కవరేజీ

  1. నేటి లైవ్ పేజీ ముగిస్తున్నాం

    ఇక్కడితో బీబీసీ తెలుగు న్యూస్ లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    మళ్లీ తాజా అప్‌డేట్లతో రేపు ఉదయం కలుద్దాం.

    ధన్యవాదాలు!

  2. పండ్లు అమ్ముకునే వికలాంగ యువకుడిపై దాడి చేసిన బీజేపీ మాజీ కార్పొరేటర్ సోదరుడు

  3. దోమలను పట్టుకునేందుకు పొద్దున్నే పనిలోకి దిగుతున్న ఇన్‌సెక్ట్ కలెక్టర్ శ్యామ్ సక్‌పాల్

  4. ఆసియా కప్: క్రికెట్ సమరానికి భారత్-పాకిస్తాన్ జట్లు రెడీగా ఉన్నాయా?

  5. వరంగల్: ‘కరీంనగర్ జైల్లో కేసీఆర్‌కు రూం రెడీ చేసి వచ్చిన’ - బండి సంజయ్

    తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడత ముగింపు సభలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగించారు.

    నడ్డా తన ప్రసంగంలో కేసీఆర్‌ను ఈ కాలం నిజాం అని అభివర్ణించారు. ఈ నిజాం అధికారం ముగిసిపోయే రోజు వచ్చిందని చెప్పుకొచ్చారు.

    చివరి నిజాం ఎలాగైతే ప్రజల మీ ఆంక్షలు విధించారో, కేసీఆర్ కూడా ఆలాగే చేస్తోందని, బీజేపీ అధికారంలోకి వస్తేనే ఈ చీకటి తొలగిపోయి, తెలంగాణలో వెలుగు వస్తుందని నడ్డా అన్నారు.

    పోలీసు వలయాలను, నిర్బంధాలను ఛేదించుకుని మహా సంగ్రామ యాత్ర ముగింపు సభకు వచ్చిన ప్రజలకు నమస్కారాలు అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ వరంగల్ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

    ‘‘కేసీఆర్ నన్ను జైల్లో పెట్టించారు. కరీంనగర్ జైల్లో ఉండి నేను కేసీఆర్‌కు అక్కడ రూం రెడీ చేసి వచ్చిన” అని సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు.

    సెప్టెంబర్ 12 నుంచి తెలంగాణలో నాలుగవ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభిస్తున్నామని కూడా సంజయ్ ఈ సభలో ప్రకటించారు.

    ‘‘కేసీఆర్ ఫామ్ హౌజ్‌ను వీడింది లేదు.. వరంగల్ ను అభివృద్ధి చేసింది లేదు. లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇవాళ ఏమైందో అందరికీ తెలుసు’’ అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

    ‘‘కేంద్ర ప్రభుత్వం యాదాద్రి నుంచి వరంగల్ కు రూ. 388 కోట్ల వ్యయంతో రోడ్డు నిర్మించింది. జగిత్యాల నుంచి కరీంనగర్ రోడ్డుకు రూ. 4,000 కోట్లకు పైగా ఖర్చు చేయనున్నాం. వరంగల్‌లో స్మార్ట్‌ సిటీ కోసం కేంద్రం 196 కోట్లు ఖర్చు చేసిందని, వరంగల్‌ జిల్లాలో సైనిక స్కూల్ రాబోతోంది. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేస్తాం’’ అని ఆయన చెప్పారు.

    రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు తెచ్చామని, రామప్ప ఆలయ అభివృద్ధి కోసం రూ. 60 కోట్లు ఖర్చు చేస్తున్నామని, వెయ్యి స్తంభాల ఆలయ అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.

  6. బిల్కిస్ బానో గ్రామం రంథిక్ పూర్ నుంచి ముస్లిం కుటుంబాలు ఎందుకు వెళ్లిపోతున్నాయి? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

  7. పాకిస్తాన్‌లో వరదల విలయం.. దాదాపు 1,000 మంది మృతి, కోట్లాది మంది నిరాశ్రయులు

    పాకిస్తాన్‌లో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు, వరదలు విలయం సృష్టిస్తున్నాయి. ఇప్పటివరకూ 982 మంది చనిపోయినట్లు నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ తెలిపింది.

    వరదల కారణంగా దాదాపు మూడు కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. పాక్ ప్రభుత్వం జాతీయ అత్యవరస పరిస్థితిని ప్రకటించింది.

    వరదల కారణంగా దేశంలో కనీవినీ ఎరుగని స్థాయిలో ‘మానవ విపత్తు’ చోటుచేసుకుందని వాతావరణ శాఖ మంత్రి షెర్రీ రెహ్మాన్ పేర్కొన్నారు.

    సహాయ చర్యలకు వర్షాలు ఆటంకంగా మారాయని అధికారులు పేర్కొన్నారు.

  8. దేశంలో వ్యవసాయ సంక్షోభం ఎందుకుంది? రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి?: కేసీఆర్

    ​తెలంగాణప్రభుత్వం అమలుచేస్తున్న వ్యవసాయ, రైతు సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు దేశంలోని 26 రాష్ట్రాల నుంచి వచ్చిన రైతు సంఘాల నాయకుల అధ్యయనం శనివారం రెండో రోజు కొనసాగింది.

    ప్రగతి భవన్‌లో వ్యవసాయం, సాగునీటి రంగాల్లో ప్రగతి మీద రూపొందించిన డాక్యుమెంటరీని దాదాపు రైతు సంఘాల నాయకులు వీక్షించారు.

    ‘‘మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు గడిచిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వ పాలన ఇంకా గాడిలో పడకుండా, ప్రజల ఆకాంక్షలు సంపూర్ణంగా నెరవేరకుండా పోవడానికి గల కారణాలను మనం అన్వేషించాలి. ముఖ్యంగా దేశంలోని రైతు సమస్యలకు ఇంకా ఎందుకు పరిష్కారం దొరకడంలేదో, ఈ దేశ పాలకులు ఎందుకు వైఫల్యం చెందుతున్నారో మనందరం చర్చించుకోవాల్సిన సందర్భం ఇది’’ అని ఈ సందర్భంగా కేసీఆర్ పేర్కొన్నారు.

    ‘‘నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం రైతులందరికీ ఉచిత విద్యుత్, సాగునీరు అందిస్తున్నపుడు ఇదే పనిని కేంద్రం దేశవ్యాప్తంగా ఎందుకు అమలు చేయదు? సాగునీరున్నది. కరెంటు ఉన్నది. కష్టపడే రైతులున్నారు. అయినా ఈ దేశంలో వ్యవసాయ సంక్షోభం ఎందుకున్నది? రైతుల ఆత్మహత్యలు ఎందుకు కొనసాగుతున్నాయి?’’ అని ప్రశ్నించారు.

    తెలంగాణ సహా దిల్లీ, ఒడిషా, గుజరాత్, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్, హరియాణా, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్, బీహార్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటక, అస్సాం, మిజోరం, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్, పుదుచ్చేరి, దాదానగర్ హవేలి తదితర రాష్ట్రాలకు చెందిన, వ్యవసాయం, రైతు సంక్షేమం కోసం దశాబ్దాలుగా పోరాటాలు చేస్తున్న పలువురు సీనియర్ రైతు సంఘాల నేతలు సహా దాదాపు 100 మంది ఈ సమావేశంలో పాల్గొన్నారు.

  9. చికెన్‌ను స్కిన్‌తో పాటు తినడం మంచిదేనా?

  10. జేపీ నడ్డా, మిథాలీ రాజ్ భేటీ

    బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భారత మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ భేటీ అయ్యారు.

    వరంగల్ పర్యటనకు తెలంగాణ చేరుకునున నడ్డా.. మిథాలీ రాజ్‌తో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

  11. ఝార్ఖండ్: సీఎం ఇంట్లో సమావేశం తరువాత బస్సుల్లో ఎమ్మెల్యేల తరలింపు

    ఝార్ఖండ్‌లో పాలక కూటమికి చెందిన ఎమ్మెల్యేలను బస్సుల్లో తరలిస్తున్నారు.

    రాంచీలో ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ ఇంట్లో సమావేశం అనంతరం ఎమ్మెల్యేలు ఉన్న బస్సులు అక్కడి నుంచి బయలుదేరాయి.

  12. జయలలిత మరణం పై విచారణ కమిటీ నివేదిక

    తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జే.జయలలిత మరణాన్ని విచారించేందుకు నియమించిన రిటైర్డ్ జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ ముఖ్యమంత్రి ఎమ్ కే స్టాలిన్ కు నివేదికను సమర్పించింది.

    జయలలిత మృతి చెందిన తీరు వివాదాస్పదం కావడంతో,తమిళనాడు ప్రభుత్వం ఆమె మరణం పై విచారణ నిర్వహించేందుకు కమిషన్ ను నియమించింది.

    ఈ విచారణ కోసం మొత్తం 58 మంది ప్రత్యక్ష సాక్షులను, పిటిషనర్లను విచారించాం. నేనీ విచారణను సాగదీస్తున్నానని కొంత మందిఅన్నారు.

    "ఈ నివేదికను విడుదల చేయాలా వద్దా అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం పై ఆధారపడి ఉంటుంది. ఈ విచారణకు అపోలో ఆస్పత్రి సిబ్బంది, జయలలిత స్నేహితురాలు శశికళ తమ సహకారాన్ని పూర్తిగా అందించారు" అని జస్టిస్ ఆర్ముగస్వామి విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు.

    ఈ నివేదికను సమర్పించేందుకు 13 నెలలు పట్టినట్లు చెప్పారు.

    జయలలిత2016లో డిసెంబరు 06న మరణించారు.

  13. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ ప్రమాణ స్వీకారం

    సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.

    ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధంకర్, కేంద్ర మంత్రి కిరెన్ రిజ్జు, సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్ వీ రమణ తదితరులు పాల్గొన్నారు.

    జస్టిస్ లలిత్ సుప్రీం కోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈయన నవంబరు 08, 2022 వరకు 74 రోజులు మాత్రమే పదవిలో ఉంటారు.

    ఆగస్టు13, 2014లో సుప్రీం కోర్టు న్యాయవాది నుంచినేరుగా న్యాయమూర్తిగా నియామకం అయ్యారు. ఇలా నియామకం అయిన వ్యక్తుల్లో జస్టిస్ లలిత్ రెండవారు.

    జస్టిస్ లలిత్ సుప్రీం కోర్టు న్యాయమూర్తి కాక ముందు సుప్రీం కోర్టులో సీనియర్ న్యాయవాదిగా ఉండేవారు.

  14. యూపీఏ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్న ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్

    ఝార్ఖండ్ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాల నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సొరేన్ యూపీఏ ఎమ్మెల్యేలతో శనివారం సమావేశమవుతున్నారు.

    హేమంత్ సొరేన్ శాసన సభ సభ్యత్వానికి ముప్పు వాటిల్లుతుండటంతో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.

    రాంచీలోని ఆయన గృహంలో ఈ సమావేశం జరుగుతుంది.

    ఇప్పటికే ఝార్ఖండ్ గవర్నర్ రమేష్ బైస్ హేమంత్ సొరేన్ శాసన సభ్యత్వాన్ని రద్దు చేశారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.

    సొరేన్ శాసన సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ కేంద్ర ఎన్నికల కమీషన్ కు లేఖను పంపినట్లు

    వార్తలొచ్చాయి.

    ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ జారీ చేస్తుందని భావిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ను రాష్ట్ర ఎలక్టోరల్ అధికారికి, శాసన సభ స్పీకర్ కు పంపిస్తారు.

    ఈ నోటీసు జారీ చేస్తే హేమంత్ సొరేన్ శాసన సభ్యత్వం రద్దయిపోతుంది.

    "ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నాడు ఈ దేశ ప్రధాన మంత్రి, రాష్ట్రపతి ఆదివాసీ సమాజానికి శుభాకాంక్షలు పంపాలని కూడా ఆలోచించలేదు. వాళ్ళ దృష్టిలో మేము గిరిజనులం కాదు. కేవలం అడవుల్లో సంచరించే మనుషులం" అని అంటూ హేమంత్ సొరేన్ ట్వీట్ చేశారు.

    ఆగస్టు 09న ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా జరుపుకుంటారు.

    ఆయన మరొక ట్వీట్ లో బీజేపీ ప్రభుత్వం పై ధ్వజమెత్తారు.

    "కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ఎంత ఎక్కువ విషపూరితమైన వాతావరణాన్ని సృష్టించినా పర్వాలేదు. నేనొక గిరి పుత్రుడును, నేను ఝార్ఖండ్ బిడ్డను. మేము భయపడేవాళ్ళం కాదు. మేము పోరాడే వర్గానికి చెందిన వాళ్ళం" అని ట్వీట్ చేశారు.

    "నాకు అధికార దాహం లేదు" అని అంటూ మరొక ట్వీట్ చేశారు.

  15. బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టికి కాంస్యం

    బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్పురుషుల డబుల్స్ విభాగంలో భారత్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి కాంస్య పతకం సాధించారు.

    సెమీ ఫైనల్స్‌లో వీరు మలేసియా జోడీ ఆరోన్ చియా, సోహ్ వూయి యిక్ చేతిలో 20-22, 21-18, 21-16 స్కోరుతో ఓడిపోయారు.

  16. జ్యూరిచ్ డైమండ్ లీగ్ ఫైనల్స్‌కు అర్హత సాధించిన నీరజ్ చోప్రా

    నీరజ్ చోప్రా మరో రికార్డ్ సాధించాడు. జ్యూరిచ్ డైమండ్ లీగ్ ఫైనల్‌కు అర్హత సాధించిన తొలి భారతీయ జావెలిన్ త్రో క్రీడాకారుడిగా ఆయన రికార్డు సాధించాడు. శుక్రవారం లుసానె డైమండ్ లీగ్-2022లో 89.08 మీటర్ల దూరం జావెలిన్ విసిరి స్వర్ణం సాధించాడు.

    దీంతో ఆయనకు వచ్చే నెలలో నిర్వహించబోయే జ్యూరిచ్ డైమండ్ లీగ్ ఫైనల్‌లో ఆడే అవకాశం దక్కింది.

    ఈయన స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ లో సెప్టెంబరు ప్రారంభంలో జరగనున్న డైమండ్ లీగ్ ఫైనల్స్ లో పోటీ పడతారు.

    దాంతోపాటు 2023లో హంగరీలోని బుడాపెస్ట్ లో జరగనున్న ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొనేందుకు కూడా అర్హత సాధించారు.

    ‘ట్రాక్ అండ్ ఫీల్డ్’ అథ్లెటిక్ విభాగాల్లో నిర్వహించే ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్‌లో నీరజ్ చోప్రా కంటే ముందు భారత్ నుంచి డిస్కస్ త్రోయర్ వికాస్ గౌడ మాత్రమే మూడు అంచెలు దాటారు.

    ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్‌ను జావెలిన్ త్రో, డిస్కస్ త్రో, షాట్ పట్, పోల్ వాల్ట్, హైజంప్, లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్, పరుగు, హర్డిల్స్ వంటి ‘ట్రాక్ అండ్ ఫీల్డ్’ అథ్లెటిక్ విభాగాల్లో నిర్వహిస్తారు.

  17. ఆల్ ఇండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) పై నిషేధాన్ని తొలగించిన ఫిఫా

    ఆల్ఇండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) పై విధించిన నిషేధాన్ని తొలగిస్తున్నట్లు ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ ఫెడరేషన్ (ఫిఫా) ప్రకటించింది.

    ఈ మేరకు ఏఐఎఫ్ఎఫ్ ట్విటర్ ద్వారా ఈ సమాచారాన్ని వెల్లడి చేసింది. ఈ మేరకు ఫిఫా పంపిన లేఖను కూడా షేర్ చేసింది.

    అండర్ 17 మహిళల ఫుట్ బాల్ ప్రపంచ కప్ ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని తెలిపింది.

    ఈ సమాచారాన్ని తెలుసుకున్న కేంద్ర యువ వ్యవహారాలు, క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ హర్షం ప్రకటించారు.

  18. హలో! గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.