You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

రష్యాలో జర్నలిస్టుల పనిని తాత్కాలికంగా రద్దు చేసిన బీబీసీ

యుక్రెయిన్‌పై జరుగుతున్నది యుద్ధం కాదని రష్యా అంటోంది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తే 15 ఏళ్లు జైలు శిక్ష విధించేలా చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం స్వతంత్ర జర్నలిజాన్ని కూడా నేరంగా పరిగణిస్తోందని బీబీసీ డైరెక్టర్ జనరల్ టిమ్ డేవీ అన్నారు.

లైవ్ కవరేజీ

అరుణ్ శాండిల్య and హరికృష్ణ సీహెచ్

  1. రష్యాలో జర్నలిస్టుల పనిని తాత్కాలికంగా నిలిపివేసిన బీబీసీ

    రష్యాలో ఫేక్ సమాచారం వ్యాప్తి చేసేవారికి 15 ఏళ్ల వరకూ జైలు శిక్ష విధించే చట్టాన్ని రష్యా పార్లమెంట్ దిగువ సభ ఆమోదించింది.

    రష్యాలో ఎన్నో స్వతంత్ర మీడియా అవుట్‌లెట్లను మూసివేశారు. లేదా ఆపరేషన్స్ జరగకుండా అడ్డుకున్నారు. బీబీసీ, డచ్ వెలే లాంటి అంతర్జాతీయ వార్తా సంస్థల కార్యకలాపాలనూ పరిమితం చేశారు.

    ఈ చట్టానికి స్పందనగా, ఇప్పుడు రష్యాలో పనిచేసే బీబీసీ జర్నలిస్టులందరి విధులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు బీబీసీ డైరెక్టర్ జనరల్ చెప్పారు.

    “ఈ చట్టం స్వతంత్ర జర్నలిజం అనే ప్రక్రియను నేరంగా పరిగణించేలా ఉంది” అని డైరెక్టర్ జనరల్ టిమ్ డేవీ అన్నారు.

    “ఈ అవాంఛనీయ పరిణామం పూర్తి ప్రభావాల గురించి అంచనా వేసేలోపు మేం రష్యాలో పనిచేసే బీబీసీ జర్నలిస్టులు, వారి సహాయ సిబ్బంది అందరి పనినీ తాత్కాలికంగా ఆపివేయడం తప్ప వేరే దారి లేదు” అని టిమ్ డేవీ అన్నారు.

    “రష్యా బయట నుంచి రష్యన్‌ భాషలో మా బీబీసీ సేవలు కొనసాగుతాయి.”

    “మా సిబ్బంది భద్రతే మాకు ముఖ్యం. తమ ఉద్యోగాలు చేసినందుకు వారిని నేర అభియోగాలు ఎదుర్కొనే ప్రమాదంలో పడేయడానికి మేం సిద్ధంగా లేం. వారందరి ధైర్యం, సంకల్పం, వృత్తి నైపుణ్యానికి నేను వారిని ప్రశంసిస్తున్నాను.”

    “మా వార్తా సేవలను ఉపయోగించే లక్షలాది రష్యన్లసహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా ప్రేక్షకులకు కచ్చితమైన, స్వతంత్ర సమాచారాన్ని అందుబాటులో ఉంచడానికి మేం కట్టుబడి ఉంటాం”

    “యుక్రెయిన్‌లో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా జర్నలిస్టులు యుక్రెయిన్‌పై దాడి గురించి రిపోర్ట్ చేయడం కొనసాగిస్తారు” అని ఆయన చెప్పారు.

  2. యుక్రెయిన్ అణు విద్యుత్‌ కేంద్రంపై రష్యా దాడులు.. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలు

  3. నన్ను స్వదేశం చేర్చండి: యుక్రెయిన్‌లో గాయపడ్డ హర్జోత్

    యుక్రెయిన్‌లో కాల్పుల్లో గాయపడి కీయెవ్‌లోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భారత యువకుడు హర్జోత్ సింగ్ వీడియోను ఏఎన్ఐ ట్వీట్ చేసింది.

    దిల్లీకి చెందిన హర్జోత్ ఉన్నత చదువుల కోసం యుక్రెయిన్‌లో ఉంటున్నారు.

    “కొత్త జీవితం లభించింది కాబట్టి, నేను భారత్ వెళ్లిపోవాలనుకుంటున్నా. నా కుటుంబంతో ఉండాలనుకుంటున్నా” అని ఈ వీడియోలో హర్జోత్ చెప్పారు.

    భారత ఏంబసీ సాయం చేయాలని కోరిన ఆయన, ఏంబసీ నుంచి తనకు ఇప్పటివరకూ ఎలాంటి సాయం అందలేదని తెలిపారు.

    హర్జోత్ సింగ్‌ను కీయెవ్‌లోని ఒక ఆస్పత్రిలో చేర్పించిన విషయం తమకు తెలుసని విదేశాంగ శాఖ చెప్పినట్లు ఏఎన్ఐ తెలిపింది.

    “హర్జోత్ సింగ్ మెడికల్ స్టేటస్ గురించి తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నాం, అతడిని వేరే ప్రాంతానికి తీసుకెళ్లవచ్చేమో చూస్తున్నాం” అని మంత్రిత్వ శాఖ తరఫున చెప్పారు. హర్జోత్ వైద్యం ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని కూడా విదేశాంగ శాఖ తెలిపింది.

    హర్జోత్‌కు ఏం జరిగింది.

    ఫిబ్రవరి 27న హర్జోత్ తన స్నేహితులతో కీయెవ్ నుంచి వేరే నగరానికి వెళ్లడానికి ప్రయత్నించారు.

    ట్రైన్లో చోటు లేకపోవడంతో హర్జోత్ ప్రైవేటు క్యాబ్ తీసుకున్నాడు. కానీ కొంతదూరం తర్వాత ముందుకు వెళ్లే పరిస్థితి లేదంటూ కొంతమంది సైనికులు ఆయన్ను వెనక్కు పంపించేశారు.

    వెనక్కు వస్తున్నప్పుడు తనపై హఠాత్తుగా నేలపైనుంచి భవనాలపై నుంచి దాడులు జరిగాయని హర్జోత్ చెప్పారు. బుల్లెట్లు తగలడంతో ఆయన క్యాబ్ నుంచి బయటికొచ్చి నేలపై పడిపోయారు.

    హర్జోత్ 3-4 గంటలు రోడ్డుపైనే ఉన్నాడని డాక్టర్లు చెప్పారు. ఆయనకు మార్చి 2న స్పృహ వచ్చింది. ఇప్పుడు హర్జోత్ కాస్త కోలుకున్నారు. కానీ, వీలైనంత త్వరగా దిల్లీ చేరుకోవాలని అనుకుంటున్నారు.

    “చనిపోయిన తర్వాత చార్టర్ ఫ్లైట్ పంపించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు” అని ఆయన వీడియో చివర్లో చెప్పారు.

    తనను త్వరగా కీయెవ్ నుంచి తరలించాలని హర్జోత్ కోరుతున్నారు. తనను వీల్ చెయిర్లో కూర్చోపెట్టి బోర్డర్ దాటించాల్సివచ్చినా, అలా చేయాలని అడుగుతున్నారు.

  4. 20 వేల మందికి పైగా భారతీయులు యుక్రెయిన్ సరిహద్దులు వీడారు-భారత ప్రభుత్వం

    అడ్వైజరీ జారీ చేసిన తర్వాత నుంచి ఇప్పటివరకూ 20 వేల మందికి పైగా యుక్రెయిన్ సరిహద్దులు వీడారని భారత విదేశాంగ శాఖ చెప్పింది.

    “అక్కడ ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. కానీ ఇంత మంది యుక్రెయిన్ వీడారని తెలీడం వల్ల ఒక భరోసా వస్తుంది” అని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ చెప్పారు.

    మరో 24 గంటల్లో భారతీయులను స్వదేశానికి తీసుకురాడానికి 16 విమానాలు అందుబాటులో ఉన్నాయని కూడా ఆయన చెప్పారు. వాటిలో వైమానిక దళానికి చెందిన సీ-17 ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఉంది.

    మరోవైపు గురువారం నాటికి బుడాపెస్ట్ నుంచి 3 వేల మందిని భారత్‌కు తరలించామని హంగరీలో ఉన్న కేంద్ర మంత్రి హరదీప్ పురి చెప్పారు.

    “మేం మరో ఏడు విమానాలు పంపించమని చెప్పాం. తర్వాత శనివారం మరో 1400 మందిని ఇక్కడ నుంచి తీసుకెళ్లడం వీలవుతుంది” అన్నారు.

  5. మోల్డోవాలోకి వెళ్లడానికి 15 గంటల ఎదురుచూపులు, లూసీ విలియమ్సన్, బీబీసీ ప్రతినిధి

    యుక్రెయిన్ భూభాగంలో రెండు ప్రాంతాల మధ్య ఇరుకుగా ఉండే మోల్డోవా క్రాసింగ్ పాయింట్ దగ్గర ఇప్పుడు శరణార్థుల సంక్షోభం వచ్చేలా కనిపిస్తోంది.

    రష్యా దళాల దాడులు తీవ్రం కావడంతో.. యుక్రెయిన్ మూడో అతిపెద్ద నగరం, దక్షిణాన ఉన్న పోర్ట్ సిటీ ఒడెస్సాకు 50 కిలోమీటర్ల దూరంలో ఉండే మోల్డోవా దేశం వదిలి వెళ్లాలనుకునే దక్షిణ తీర ప్రాంతాల ప్రజలను ఆకర్షిస్తోంది.

    ఈ సరిహద్దును దాటడానికి వీరంతా చలిలో చాలా సమయం వేచిచూడాల్సి వస్తోంది. వాహనాలు లేనివారు 10-15 గంటలపాటు క్యూలో నిలబడినట్లు వార్తలు వస్తున్నాయి.

    ఇక్కడకు వస్తున్నవారిని కలుస్తున్న స్థానిక వాలంటీర్లు తమ ప్రైవేటు కార్లలో వారికి లిఫ్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఎమర్జెన్సీ షెల్టర్లకు వెళ్లే బస్సులన్నీ యుక్రెయిన్ ప్రజలతో కిటకిటలాడిపోతున్నాయి.

    మోల్డావా రాజధాని చిసినావు వైపు వెళ్లే రోడ్డుపై దక్షిణ యుక్రెయిన్ నగరాల నుంచి వెళ్తున్న శరణార్థుల కార్లు వరుసకట్టాయి.

    దాదాపు లక్షా 70 వేల మంది మోల్డోవా మీదుగా యుక్రెయిన్ వీడినట్లు యూఎన్‌హెచ్‌సీఆర్ చెప్పింది. 70 వేల మంది ఇంకా దేశంలోనే ఉన్నారని తెలిపింది.

    30 లక్షలమంది ఉన్న చిన్న దేశంలో ఇది చాలా పెద్ద సంఖ్య, ఒడెస్సా మీద పూర్తి స్థాయి దాడులు జరిగే అవకాశం ఉండడంతో మోల్డోవా వైపు వచ్చేవారి సంఖ్య మరింత పెరగచ్చని అధికారులు భావిస్తున్నారు.

  6. ఫొటోల్లో: యుక్రెయిన్ యుద్ధానికి ముందు, ఆ తర్వాత

    మీరు బీబీసీ కవరేజీ చూస్తూనే ఉన్నారు.

    రష్యా దళాలు యుక్రెయిన్‌లోని ఎన్నో కీలక నగరాలపై దాడులు కొనసాగిస్తూ ముందుకు చొచ్చుకెళ్తున్నాయి.

    రష్యా దళాలు కీయెవ్‌కు దగ్గరవడంతో, నగరం మీద ఇప్పటికే భీకరమైన గగనతల దాడులు జరుగుతున్నాయి.

    గత శనివారం తెల్లవారుజామున కింద ఉన్న అపార్ట్‌మెంట్ మీద రష్యా క్షిపణి పడింది.

    చిన్న నగరమైన ఇర్పిన్ కీయెవ్‌కు 20 కిలోమీటర్లు వాయవ్యంగా ఉంటుంది. అది యుక్రెయిన్, రష్యా దళాల మధ్య గత వారం నుంచీ జరుగుతున్న పోరాటంలో చిక్కుకుపోయి యుద్ధరంగంగా మారిపోయింది.

    యుక్రెయిన్‌లో రెండో అతిపెద్ద నగరం ఖార్కియెవ్ రష్యా బీకర బాంబు దాడులకు కేంద్రంగా మారింది.

    కీవ్‌కు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెర్నివ్ నగరం మీద కూడా ఉత్తరం నుంచి దేశంలోకి చొరబడుతున్న రష్యా దళాలు బీకర బాంబు దాడులు చేశాయి.

  7. యుక్రెయిన్ యుద్ధంలో కొడుకును పోగొట్టుకున్న తండ్రి ఆవేదన

  8. బ్రేకింగ్ న్యూస్, పుతిన్: మా మీద మరిన్ని ఆంక్షలు విధించొద్దు

    రష్యా మీద మరిన్ని ఆంక్షలు విధించడం ద్వారా పరిస్థితుల్ని మరింత దిగజార్చవద్దని ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు.

    యుక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను వ్యతిరేకిస్తూ పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆర్థికపరమైన ఆంక్షలు విధిస్తున్నాయి.

    ప్రభుత్వానికి చెందిన రష్యా 24 చానెల్‌లో పుతిన్ మాట్లాడారు.

    ‘‘మా ఇరుగుపొరుగు దేశాలపై మాకు ఎలాంటి దురుద్దేశాలూ లేవు’’ అని పుతిన్ చెప్పారు.

    అలాగే, తమ పొరుగు దేశాలు మరిన్ని చర్యలు తీసుకుని, ఇరువురి మధ్య సంబంధాలను చెడగొట్టుకునే అవసరం కూడా లేదని అన్నారు.

    ‘‘సంబంధాలను ఎలా తిరిగి గాడిలో పెట్టుకోవాలి అని అందరూ ఆలోచించాలి. ఎప్పట్లాగే సహకరించుకోవాలి, సంబంధాలను పెంచుకోవాలి’’ అని పుతిన్ చెప్పారు.

    రష్యాపై మరింతగా ఒత్తిడి పెంచే అంశంపై చర్చించేందుకు బ్రస్సెల్స్‌లో పాశ్చాత్య దేశాల విదేశాంగ మంత్రులు సమావేశం అవుతున్నారు. ఈ నేపథ్యంలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

    రష్యాకు వ్యతిరేకంగా జరిగిన వ్యతిరేక చర్యల కారణంగానే రష్యా సైన్యం అడుగులు వేయాల్సి వచ్చిందని పుతిన్ మరోసారి చెప్పారు.

  9. న్యూక్లియర్ ప్లాంట్‌పై రష్యా దాడిని ఖండించిన ప్రపంచ నేతలు

    రష్యా దళాల దాడితో ఒక ఒక న్యూక్లియర్ ప్లాంట్‌ మంటల్లో చిక్కుకోవడంతో రష్యా మొత్తం ఐరోపా ఖండం భద్రతనే ప్రమాదంలో పడేస్తోందని ప్రపంచ నేతలు ఆరోపించారు.

    యూరప్‌లోనే అతిపెద్దదైన జేపొరజియా న్యూక్లియర్ ప్లాంట్‌లో మంటలు చెలరేగడంతో రష్యా దాడుల వల్లే అది జరిగిందని యుక్రెయిన్ చెప్పింది.

    ప్లాంట్ బయట ఉన్న ఒక భవనంలో వచ్చిన మంటలను యుక్రెయిన్ అత్యవసర సేవలు ఆర్పగలిగాయి. కానీ అధికారులు మాత్రం రష్యా దళాలు ఆ ప్లాంట్‌ను స్వాధీనం చేసుకున్నాయని చెప్పారు.

    "రష్యా నిర్లక్ష్యపు దాడులు మొత్తం యూరప్‌ భద్రతనే ప్రమాదంలో పడేయవచ్చు" అని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు.

    ఆ ప్రాంతం చుట్టూ రష్యా తమ సైనిక కార్యకలాపాలు ఆపివేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, రష్యా ఈ భయంకరమైన దాడులను తక్షణం ఆపేయాలని కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో కోరారు.

  10. బ్రేకింగ్ న్యూస్, రష్యా అధీనంలోకి యుక్రెయిన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్

    జేపొరజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌ను రష్యా బలగాలు వారి అధీనంలోకి తీసుకున్నాయని యుక్రెయిన్ అధికారులు వెల్లడించారు.

    ప్లాంటులో పనిచేసే సిబ్బంది వారి పని కొనసాగిస్తున్నారని, పవర్ యూనిట్ స్థితిగతులను వారు పరిశీలిస్తున్నారని స్థానిక అధికారులను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది.

  11. పాపులారిటీ పెంచుకునే ప్రయత్నం చేయకండి-సీజేఐ ఎన్వీ రమణ, యుక్రెయిన్ నుంచి తప్పించాలంటూ విద్యార్థిని పిటిషన్‌పై సీజేఐ వ్యాఖ్య

    “మనం గతం నుంచి ఏం నేర్చుకోలేదు. కోర్టు ఎలాంటి ఆదేశాలూ ఇవ్వలేదు, మేం విద్యార్థుల గురించే ఆందోళన చెందుతున్నాం” అని యుక్రెయిన్‌లోని ఒక భారత యువతిని కాపాడాలంటూ దాఖలైన పిటిషన్ విచారణ సమయంలో సీజేఏ ఎన్వీ రమణ అన్నారు.

    ఫాతిమా అహానా అనే విద్యార్థి యుక్రెయిన్ నుంచి తనను బయటకు తీసుకురావాలంటూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఆమె రొమేనియా సరిహద్దుల్లో చిక్కుకుపోయారు. ముందుకు వెళ్లలేకపోయారు.

    ఆమెను మిగతా విద్యార్థులతో కలిపి ప్రత్యేక విమానంలో దేశానికి తీసుకొస్తారని భారత అటార్నీ జనరల్(ఏజీ) కేకే వేణుగోపాల్ సుప్రీంకోర్టుకు తెలిపారు.

    సీజేఐ ఎన్వీ రమణ అధ్యక్షతన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారించింది. యుక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురావడం కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి సమాచారం ఇవ్వాలని ఏజీని కోరింది.

    వకీళ్లకు సలహా

    ఈ సందర్భంగా విద్యార్థుల గురించే తమకు ఆందోళనగా ఉందని, వారు యుక్రెయిన్ సరిహద్దులకు దాదాపు వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఖార్కియెవ్‌లో ఉన్నారని పిటిషనర్ వకీలు విశాల్ తివారీ అన్నారు.

    దాంతో “ఇది చాలా సున్నితమైన అంశమని మాకు తెలుసు. దయచేసి మీరు దీని ద్వారా పాపులారిటీ పొందాలని ప్రయత్నించకండి. మేం మీ గత పిటిషన్లు చూశాం” అని సీజేఐ ఆయనకు సూచించారు.

    ఏజీ ప్రస్తుత పరిస్థితిని అటార్నీ జనరల్‌కు వివరించారు. విద్యార్థులను స్వదేశానికి తీసుకురావడం గురించి పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు సమాచారం ఇచ్చామని తెలిపారు.

    “మనం గత యుద్ధ పరిస్థితుల నుంచి నేర్చుకోకపోవడం దురదృష్టకరం. మేం ఇంతకంటే ఎక్కువ చెప్పలేం, కానీ విద్యార్థుల గురించి మాకు ఆందోళన ఉంది” అని సీజేఐ అన్నారు.

    ఇప్పటివరకూ 17 వేల మందిని తీసుకొచ్చారు

    ఇప్పటివరకూ యుక్రెయిన్ నుంచి 17 వేల మందిని భారత్‌కు తీసుకొచ్చామని ఏజీ సుప్రీంకోర్టుకు చెప్పారు. అక్కడున్న భారతీయులు అందరినీ తిరిగి తీసుకురాడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని తెలిపారు. మనకు కువైట్ నుంచి లక్షల మందిని తీసుకొచ్చిన అనుభవం ఉందన్నారు.

    దాదాపు 7 వేల మంది యుక్రెయిన్‌లో చిక్కుకుని ఉన్నారని, భారత ప్రభుత్వం వారిని వీలైనంత త్వరగా తీసుకురావడానికి అన్ని చర్యలూ చేపడుతోందని ఏజీ సుప్రీంకోర్టుకు తెలిపారు.

  12. శుక్రవారం ఇప్పటివరకు ఏం జరిగిందంటే..

    జేపొరజియాలోని న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌పై రష్యా దాడులతో అక్కడ మంటలు చెలరేగాయి. అనంతరం మంటలను యుక్రెయిన్ ఎమర్జెన్సీ సర్వీస్ అదుపుచేసింది.

    * ఈ పేలుళ్లు, మంటలలో ప్రాణనష్టమేమీ లేదు.

    * జేపొరజియాను రష్యా సైన్యం తమ అధీనంలోకి తీసుకుంది.

    * రష్యాను నిలువరించకపోతే 1986లో చెర్నోబిల్‌లో అణు విషాదం చోటుచేసుకున్నట్లే ఇప్పుడు కూడా అణు ముప్పు తలెత్తే ప్రమాదం ఉందని యుక్రెయిన్ అధ్యక్షుడు అన్నారు.

    * యుక్రెయిన్ తీరంలో ఎస్టోనియాకు చెందిన ఓ ఓడలో పేలుడు సంభవించింది. అనంతరం అది మునిగిపోయింది.

    * యుక్రెయిన్‌ను వీడి పొరుగుదేశాలకు తరలిన శరణార్థుల సంఖ్య 10 లక్షలు దాటిందని ఐరాస తెలిపింది.

    * యుక్రెయిన్, రష్యాల మధ్య మధ్యవర్తిత్వానికి తాను సిద్ధమని సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ చెప్పారు.

    రష్యా, యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ మీకు ‘హరికృష్ణ’ అందిస్తారు.

    ధన్యవాదాలు

  13. యుద్ధభూమిలో భర్త, పొరుగుదేశంలో భార్యాపిల్లలు

    తమ భార్యా పిల్లల్ని సురక్షితంగా పొరుగు దేశాలకు పంపించి, దేశం కోసం యుద్ధభూమిలోకి దిగుతున్నారు చాలామంది యుక్రెయిన్ పౌరులు.

    అలాంటి పౌరుల కుటుంబ సభ్యుల ఆవేదనకు రూపమీ కథనం.

  14. క్షిపణుల దాడులలో ధ్వంసమవుతున్న భవనాలు

    రష్యా చేస్తున్న క్షిపణి దాడులతో యుక్రెయిన్‌లోని అనేక భవనాలు ధ్వంసమవుతున్నాయి.

    రాజధాని కీయెవ్ సహా ఖార్కియెవ్, ఇతర నగరాలు, పట్టణాలలో ప్రభుత్వ భవనాలు, పౌరుల ఇల్లు కూడా రష్యా క్షిపణి దాడులతో ధ్వంసమవుతున్నాయి.

    అందుకు ఉదాహరణ ఈ చిత్రాలు.

    ధ్వంసం కావడానికి ముందు ఆయా భవనాలు ఎలా ఉండేవి, ధ్వంసమైన తరువాత ఎలా ఉన్నాయో ఈ చిత్రాలలో చూడండి.

  15. బ్రేకింగ్ న్యూస్, రష్యా అధీనంలోకి యుక్రెయిన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్

    జేపొరజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌ను రష్యా బలగాలు వారి అధీనంలోకి తీసుకున్నాయని యుక్రెయిన్ అధికారులు వెల్లడించారు.

    ప్లాంటులో పనిచేసే సిబ్బంది వారి పని కొనసాగిస్తున్నారని, పవర్ యూనిట్ స్థితిగతులను వారు పరిశీలిస్తున్నారని స్థానిక అధికారులను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది.

  16. - 5 డిగ్రీల చలిలో 30 గంటల పాటు శ్రమిస్తే కానీ యుక్రెయిన్ దాటలేకపోయాం

    యుక్రెయిన్ నుంచి బయటపడేందుకు భారతీయ విద్యార్థులు కష్టాలుపడాల్సి వస్తోంది.

    యుక్రెయిన్‌ బోర్డర్ దాటేందుకు, రొమేనియా సరిహద్దుల్లో మైనస్ 5 డిగ్రీల మంచులో 30 గంటలకుపైగా నిరీక్షించాల్సివచ్చిందని భారత విద్యార్థులు చెప్పారు.

    ఇంకా వారు ఏం చెప్పారో ఈ వీడియోలో చూడండి.

  17. యుక్రెయిన్ తీరంలోని ఎస్టోనియా నౌకలో పేలుడు, మునక

    యుక్రెయిన్ తీరంలో ఎస్టోనియాకు చెందిన సరకు రవాణా నౌక మునిగిపోయింది.

    పేలుడు కారణంగా ఈ నౌక మునిగిపోయిందని ఎస్టోనియాకు చెందిన దీని యజమానులు తెలిపారు.

    నౌకలోని ఆరుగురు సిబ్బందిని యుక్రెయిన్ రెస్క్యూ సర్వీస్ రక్షించింది.

    పనామా జెండా ఉన్న ఈ నౌక ఎస్టోనియా బేస్డ్ కంపెనీ విస్టా షిప్పింగ్ ఏజెన్సీ యాజమాన్యంలో ఉంది.

    బాలిస్టిక్ దేశమైన ఎస్టోనియా నాటోలో భాగం. ఎస్టోనియాకు రష్యాతో సరిహద్దు ఉంది.

    యుక్రెయిన్ తీరంలో లంగరువేసి ఉన్న ఈ నౌకలో పేలుడు ఎలా జరిగిందనేది ఇంకా తెలియలేదు.

    పది లక్షల జనాభా ఉన్న రేవు పట్టణం ఒడెసాను చేజిక్కించుకునేందుకు నేల, నీటిపై ప్రయాణించే యుద్ధవాహనాలను రష్యా పంపిస్తోందని యుక్రెయిన్ మిలిటరీ చెబుతోంది.

  18. ‘రష్యాలో బీబీసీపై నియంత్రణ’

    రష్యాలో ‘బీబీసీ రష్యన్’ సర్వీసులను అక్కడి సమాచార శాఖ అధికారులు నియంత్రించారు.

    ఈ మేరకు రష్యా వార్తాఏజెన్సీ ఆర్ఐఏ వెల్లడించింది.

    మరో రెండు న్యూస్ అవుట్‌లెట్‌లు మెడూజా, రేడియో లిబర్టీలను కూడా బ్లాక్ చేసినట్లు ఆర్ఐఏ తెలిపింది.

  19. అణ్వాయుధాలు ప్రయోగించడంలో ప్రోటోకాల్స్ ఏమిటి

    ప్రపంచంలో అత్యధిక అణ్వాయుధ నిల్వలు రష్యా దగ్గరే ఉన్నాయి.

    రష్యాతోపాటూ అమెరికా, చైనా, బ్రిటన్ సహా చాలా దేశాల దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి.

    అణ్వాయుధాలను వినాశనం సృష్టించే ఆయుధాలుగా చెబుతారు. అలాంటప్పుడు రష్యా యుక్రెయిన్‌పై యుద్ధం చేస్తుండడంతో ఉద్రిక్తతలు ఏర్పడడం సహజం.

    కానీ, అసలు అణ్వాయుధాల ఉపయోగించడానికి ఎలాంటి ప్రొటోకాల్స్ ఉన్నాయి. వినాశనం సృష్టించే ఈ ఆయుధాన్ని ప్రయోగించే తాళం చెవి ఎవరిదగ్గర ఉంటుంది. రష్యా, అమెరికా, చైనా, బ్రిటన్‌లో ఈ అణ్వాయుధాలు ప్రయోగించడానికి బటన్ ఎవరు నొక్కుతారు అనేది ఒక అంతుపట్టని ప్రశ్న.

    అణ్వాయుధాల వినియోగం చుట్టూ ఉన్న ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఈ కథనం చదవండి.

  20. బ్రేకింగ్ న్యూస్, జేపొరజియా న్యూక్లియర్ ప్లాంట్‌లో మంటలను అదుపుచేశాం: యుక్రెయిన్

    జేపొరజియా న్యూక్లియర్ ప్లాంట్‌లో మంటలను అదుపు చేసినట్లు యుక్రెయిన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ తెలిపింది.

    ‘ఉదయం 6.20 గంటలకు(స్థానిక కాలమానం) జేపొరజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ట్రైనింగ్ బిల్డింగ్‌లో మంటలను పూర్తిగా అదుపుచేశాం. మంటల కారణంగా ఎవరూ గాయపడలేదు’’ అని ఎమర్జెన్సీ సర్వీసెస్ తన సోషల్ మీడియా ఖాతాలలో ప్రకటించింది.