మధ్యాహ్నం 4 గంటల వరకు 29.76% పోలింగ్ నమోదు
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మంగళవారం మధ్యాహ్నం 4 గంటల వరకు 29.76 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఈ ఎన్నికల్లో 150 స్థానాలకు గానూ బీజేపీ 149, కాంగ్రెస్ 146, టిఆర్ఎస్ 150, ఎంఐఎం 51, తెలుగుదేశం 106 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. మొత్తం 1,122 మంది అభ్యర్థులు పోటీ పడుతూండగా, అందులో 415 మంది స్వతంత్రులు ఉన్నారు. వైయస్సార్సీపీ పోటీ చేయడం లేదు. జనసేన ముందు పోటీ చేస్తామని ప్రకటించి, తరువాత వెనక్కు తగ్గి, బీజేపీకి మద్దతు ప్రకటించింది.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మంగళవారం మధ్యాహ్నం 4 గంటల వరకు 29.76 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
సినీ నటులు డాక్టర్ రాజశేఖర్, జీవితలు ఫిల్మ్ నగర్లోని జూబిలీ పబ్లిక్ స్కూల్లో ఓటు వేశారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు 25.34 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు.
అభ్యర్థుల గుర్తులు తారుమారు కావడంతో ఓల్డ్ మలక్ పేట్ డివిజన్లోని 69 పోలింగ్ కేంద్రాల్లో రిపోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.
సీపీఐ అభ్యర్థికి చెందిన ఏజెంట్ తమ అభ్యర్థి గుర్తు బ్యాలెట్ పత్రాల్లో కనిపించడం లేదని ఫిర్యాదు చేయడంతో ఈ వార్డులో గురువారం(3 డిసెంబర్) రీపోలింగ్కు ఈసీ నిర్ణయించింది.
ఓల్డ్ మలక్ పేట డివిజన్ వార్డు నంబర్ 26లో బ్యాలెట్ పత్రాల్లో సీపీఐ గుర్తుకు బదులు సీపీఎం గుర్తు ఉండడాన్ని ఎన్నికల పరిశీలకులు గుర్తించారు.
దీంతో, ఆ వార్డులోని మొత్తం 69 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్కు నిర్ణయించారు.
రీపోలింగ్ నిర్ణయంతో గ్రేటర్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ నిషేధిస్తున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది.
గురువారం సాయంత్రం 6 గంటల వరకూ ఎగ్జిట్ పోల్స్ ప్రసారం చేయకూడదని సూచించింది.
మధ్యాహ్నం 1 గంట వరకు వరకు 18.20 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బంజారాహిల్స్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
రోడ్ నంబర్ 14, బిఎస్డీ డీఏవీ స్కూల్లోని పోలింగ్ కేంద్రంలో ఆమె ఓటు వేశారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.. ఉదయం 11 వరకు 8.90 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
బేగంపేట, మూసాపేట పోలింగ్ కేంద్రాల దగ్గర దృశ్యాలు
జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 వరకూ మొదటి రెండు గంటల్లో 3.10 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు చెప్పారు.
ప్రముఖ నటుడు చిరంజీవి, భార్యతో కలిసి జూబ్లీ హిల్స్ లోని జూబ్లీ క్లబ్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ సమయంలో హఫీజ్ పేట డివిజన్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
టీఆర్ఎస్ అభ్యర్థి ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలపై బీజేపీ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది.
తర్వాత అది తోపులాటకు దారితీసింది
చివరకు టీఆర్ఎస్ కార్యకర్తలు ఫ్లెక్సీలు తొలగించడంతో.. బీజేపీ కార్యకర్తలు శాంతించారు.
ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ శాస్త్రిపురంలోని సెయింట్ ఫయాజ్ స్కూల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
దయచేసి అందరూ ఓటేయాలని ఆయన సోషల్ మీడియాలో కోరారు. ప్రశాంతమైన హైదరాబాద్ కోసం, హైదరాబాదీల విభిన్న సంస్కృతి, గుర్తింపు కోసం, భారత ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు అందరూ ఓటు వేయాలని సూచించారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, తన కుటుంబ సభ్యులతో కలిసి కాచిగూడ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.
ఓటు రాజ్యాంగం ద్వారా అందిన హక్కు అని, సమర్థ పరిపాలన కోసం మనందరం దానిని ఉపయోగించుకోవాలి అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, కుటుంబసభ్యులతో కలిసి రాజేంద్రనగర్ డివిజన్లోని ఉప్పర్ పల్లి పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.
బంజారాహిల్స్లోని నందినగర్ జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్లో మంత్రి కేటీఆర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతో పాటు భార్య శైలిమ కూడా ఓటేశారు.
హైదరాబాద్ నగర అభివృద్ధికి ఓటేశామని కేటీఆర్ అన్నారు.ప్రజలంతా ఓటింగ్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజా సమస్యలపైన ప్రశ్నించాలి అంటే కచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.
మరికాసేపట్లో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ హైదరాబాద్నగరంలోని మొత్తం 150 వార్డుల్లో పోలింగుప్రక్రియ మొదలవనుంది.
ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. సిబ్బంది పోలింగ్ స్టేషన్లకు చేరుకున్నారు. ఇక హైదరాబాద్ నగరంతో పాటూ జిల్లాల నుంచి వచ్చిన పోలీసులు భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.
ఈ మధ్య కాలంలో ఎక్కడా లేనట్టుగా బ్యాలెట్ పద్ధతిలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈవీఎంలు వాడడం లేదు.
ఈ ఎన్నికల్లో 150 స్థానాలకుగానూ బీజేపీ 149, కాంగ్రెస్ 146, టిఆర్ఎస్ 150, ఎంఐఎం 51, తెలుగుదేశం 106 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.
మొత్తం 1,122 మందిఅభ్యర్థులు పోటీ పడుతూండగా, అందులో 415 మంది స్వతంత్రులు ఉన్నారు. వైయస్సార్సీపీ పోటీ చేయడం లేదు. జనసేన ముందుపోటీ చేస్తామని ప్రకటించి, తరువాత వెనక్కు తగ్గి, బీజేపీకి మద్దతు ప్రకటించింది.
గ్రేటర్ పరిధిలో మొత్తం 74 లక్షల 67 వేల 256 మంది ఓటర్లు ఉండగా, వారిలో 38 లక్షల 89 వేల 637 మంది పురుషులు, 35 లక్షల 76 వేల 941 మంది మహిళలు, 687 మంది, ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. మొత్తం 150 డివిజన్లూ కలిపి 9,101 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
పార్టీల జెండాలు కనిపించకుండా జాగ్రత్తలు
ఆదివారం సాయంత్రానికి ప్రచారం ముగియడంతో, సోమవారం నగరలోని ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించారు. పార్టీ కార్యాలయాలు, జెండాలుకూడా కనిపించకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.
పోలింగ్ బ్యాలెట్ పత్రాల ద్వారా జరుగుతుండడంతో, బాక్సుల తరలింపు, సీల్ వేయడం, పత్రాలను భద్రపరిచడం, స్ట్రాంగ్ రూంలాంటి ఏర్పాట్లను ఎన్నికల సంఘం తరపున ఉన్నతాధికారులు పరిశీలించారు.
కరోనా పాజిటివ్ ఉన్నవారికి, వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించారు. ఇప్పటికే ఈ బ్యాలెట్లువెనక్కు తీసుకునే ప్రక్రియ పూర్తయింది. సాయంత్రం ఆరు గంటలలోపు క్యూలో ఉన్న అందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది.
ఈసారీ పోటాపోటీ
బహుశా, హైదరాబాద్ చరిత్రలో అతి తక్కువ సమయంలో, అత్యంత పోటాపోటీగా ఈ ఎన్నికలు జరగబోతున్నాయి.
ఎన్నికల్లో ఓటువేయడానికి ఓటరు స్లిప్పుతో పాటూ ఏదైనా గుర్తింపుకార్డు, అంటే ఓటర్ కార్డు లేదా మరో 18 రకాలగుర్తింపు కార్డుల్లో ఏదైనా ఉండవచ్చు.
ఓటర్ స్లిప్పు ఓటర్ జాబితాలో పేరు, నంబర్ గుర్తించడం కోసమే తప్ప, గుర్తింపు కోసం కాదు. కాబట్టిస్లిప్పుతో పాటూ ఏదైనా గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి.
అలాగే ఓటర్ స్లిప్పు లేనంత మాత్రాన ఓటు వేయడానికి అనర్హులు కారు. కానీఓటర్ల జాబితాలో మాత్రం వారి పేరు ఉండాలి.
గత ఎన్నికల్లో 150 స్థానాలకు గానూ టిఆర్ఎస్ 99, ఎంఐఎం 44, బీజేపీ 4, కాంగ్రెస్ 2, తెలుగుదేశం 1 సీటు గెలుచుకున్నాయి. ఈసారీ ఫలితాలు డిసెంబరు 4న వస్తాయి.
జీహెచ్ఎంసీ ఎన్నికల విశేషాలు, పోలింగ్ సరళిని ఇక్కడ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటాం. తాజా అప్డేట్స్ కోసం రిఫ్రెష్ చేస్తూ ఉండండి.