కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించడానికి అమలు చేస్తున్న లాక్డౌన్ ను ఇదే స్ఫూర్తితో కొనసాగించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలను కోరారు.
కరోనా వైరస్ సోకిన వారిని గుర్తించి చికిత్స అందించడం, వారు కలిసిన వారిని గుర్తించి క్వారంటైన్ చేయడం క్రమం తప్పకుండా చేస్తున్నామని వెల్లడించారు.
లాక్డౌన్ కొనసాగుతున్నప్పటికీ నిత్యావసరాలకు కొరత రాకుండా చూడాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.
వరికోతలు.. ధాన్యం, ఇతర పంట ఉత్పత్తుల కొనుగోళ్లు యథావిధిగా జరపాలని చెప్పారు.
కరోనా వైరస్ సోకిన వారికి అందుతున్న చికిత్స, లాక్ డౌన్ అమలు, వ్యవసాయ సంబంధ కార్యక్రమాలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు.
కరోనా వైరస్ లక్షణాలున్న వారికి పరీక్షలు జరుపుతున్నామని, శుక్రవారం కొత్తగా 16 మందికి పాజిటివ్ వచ్చిందని, వారికి చికిత్స అందిస్తున్నామని సమీక్షలో పాల్గొన్న అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ అధికారులకు పలు సూచనలు చేశారు.
లాక్ డౌన్ ను కట్టుదిట్టంగా అమలు చేయాలని.. దేశంలో, రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు కావడం వల్లనే వైరస్ ఇతర దేశాల మాదిరిగా ఎక్కువగా విస్తరించడం లేదన్న వాస్తవాన్ని గుర్తించి ప్రజలు సహకరించాలని కోరారు.
లాక్ డౌన్ సందర్భంగా నిత్యావసర సరుకుల కొరత లేకుండా చూడాలని.. పాలు, పండ్లు, కూరగాయలు, మందులు, మాంసం తదితర విక్రయాలు యథావిధిగా జరిగే విధంగా చూడాలని కోరారు.
రేషన్ షాపుల ద్వారా నియంత్రిత పద్ధతిలో జరుగుతున్న ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని.. చెప్పిన సమయానికి వచ్చి, సామాజిక దూరం పాటించి బియ్యం పొందాలని సూచించారు.
ప్రభుత్వం ఇప్పటికే చెప్పిన దాని ప్రకారం రేషన్ కార్డున్న ప్రతి కుటుంబానికి రూ.1500 చొప్పున నగదును బ్యాంకు అకౌంటులో వేసే కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైందని.. అందరికీ డబ్బులు అందుతాయని చెప్పారు.
శనివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో జరిగే వీడియో కాన్ఫరెన్సులో ప్రస్తావించాల్సిన అంశాలు, మధ్యాహ్నం జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చకు పెట్టాల్సిన అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు.