You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

కరోనావైరస్: లాక్‌డౌన్‌ను ఇదే స్ఫూర్తితో కొనసాగించాలి - కేసీఆర్

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ బాధితుల సంఖ్య 16,01,984కు చేరింది. అయితే, ఈ వ్యాధి నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య కూడా 3,55,066కు పెరగడం ఒక సానుకూల అంశం. ఈ వైరస్ ధాటికి ఇప్పటివరకు 95,731 మంది చనిపోయారు.

లైవ్ కవరేజీ

  1. లక్షకు చేరువలో కరోనావైరస్ మృతుల సంఖ్య

    ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 16 లక్షలు దాటింది. మృతుల సంఖ్య లక్షకు చేరువలో ఉంది.

    ఇవీ శుక్రవారం నాటి ముఖ్యమైన అప్‌డేట్స్

    * కరోనావైరస్ సోకి ఐసీయూలో చేరిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆరోగ్యం మెరుగుపడింది. ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు ఆయన్ను మార్చారు.

    * కరోనావైరస్ వల్ల మరణాల్లో వృద్ధులే ఎక్కువగా ఉంటున్నారు. కానీ, 101 ఏళ్ళ బ్రిటన్ వాసి కీత్ వాట్సన్ ఈ వైరస్‌తో పోరాడి గెలిచారు.

    * కరోనావైరైస్ చికిత్సలో కీలకమని చెబుతున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రల కోసం ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోంది. భారత్ వద్ద ప్రస్తుతం 3.28 కోట్ల మాత్రలు ఉన్నాయని కేంద్రం తెలిపింది.

    * పంజాబ్ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను మే 1 వరకు పొడిగించారు.

    * భారత్‌లో కరోనావైరస్ మరణాల సంఖ్య 206కి చేరింది.

    * ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం కొత్తగా 16 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 381కి చేరింది.

    * తెలంగాణలోనూ కొత్తగా 16 పాజిటివ్ కేసులు నిర్ధరణయ్యాయి.

  2. లాక్‌డౌన్‌ను ఇదే స్ఫూర్తితో కొనసాగించాలి: కేసీఆర్

    కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించడానికి అమలు చేస్తున్న లాక్‌డౌన్ ను ఇదే స్ఫూర్తితో కొనసాగించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలను కోరారు.

    కరోనా వైరస్ సోకిన వారిని గుర్తించి చికిత్స అందించడం, వారు కలిసిన వారిని గుర్తించి క్వారంటైన్ చేయడం క్రమం తప్పకుండా చేస్తున్నామని వెల్లడించారు.

    లాక్‌డౌన్ కొనసాగుతున్నప్పటికీ నిత్యావసరాలకు కొరత రాకుండా చూడాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.

    వరికోతలు.. ధాన్యం, ఇతర పంట ఉత్పత్తుల కొనుగోళ్లు యథావిధిగా జరపాలని చెప్పారు. కరోనా వైరస్ సోకిన వారికి అందుతున్న చికిత్స, లాక్ డౌన్ అమలు, వ్యవసాయ సంబంధ కార్యక్రమాలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు.

    కరోనా వైరస్ లక్షణాలున్న వారికి పరీక్షలు జరుపుతున్నామని, శుక్రవారం కొత్తగా 16 మందికి పాజిటివ్ వచ్చిందని, వారికి చికిత్స అందిస్తున్నామని సమీక్షలో పాల్గొన్న అధికారులు తెలిపారు.

    ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ అధికారులకు పలు సూచనలు చేశారు.

    లాక్ డౌన్ ను కట్టుదిట్టంగా అమలు చేయాలని.. దేశంలో, రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు కావడం వల్లనే వైరస్ ఇతర దేశాల మాదిరిగా ఎక్కువగా విస్తరించడం లేదన్న వాస్తవాన్ని గుర్తించి ప్రజలు సహకరించాలని కోరారు.

    లాక్ డౌన్ సందర్భంగా నిత్యావసర సరుకుల కొరత లేకుండా చూడాలని.. పాలు, పండ్లు, కూరగాయలు, మందులు, మాంసం తదితర విక్రయాలు యథావిధిగా జరిగే విధంగా చూడాలని కోరారు.

    రేషన్ షాపుల ద్వారా నియంత్రిత పద్ధతిలో జరుగుతున్న ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని.. చెప్పిన సమయానికి వచ్చి, సామాజిక దూరం పాటించి బియ్యం పొందాలని సూచించారు.

    ప్రభుత్వం ఇప్పటికే చెప్పిన దాని ప్రకారం రేషన్ కార్డున్న ప్రతి కుటుంబానికి రూ.1500 చొప్పున నగదును బ్యాంకు అకౌంటులో వేసే కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైందని.. అందరికీ డబ్బులు అందుతాయని చెప్పారు.

    శనివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో జరిగే వీడియో కాన్ఫరెన్సులో ప్రస్తావించాల్సిన అంశాలు, మధ్యాహ్నం జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చకు పెట్టాల్సిన అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు.

  3. ఏపీలో 16 మందికి కొత్తగా కరోనా పాజిటివ్.. మొత్తం 381 కేసులు

    ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 7 గంటల వరకు నిర్వహించిన కోవిడ్-19 పరీక్షల్లో కొత్తగా 16 పాజిటివ్ కేసులు నిర్ధరణయ్యాయి.

    గుంటూరులో 7, తూర్పుగోదావరి 5, కర్నూలులో 2, ప్రకాశం జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి.

    దీంతో మొత్తం కేసుల సంఖ్య 381కి చేరింది.

    ఇప్పటివరకు 10 మంది కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా ఆరుగురు మరణించారు.

    ప్రస్తుతం 365 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

  4. దక్షిణకొరియాలో కరోనావైరస్ సోకి కోలుకున్న 91 మందికి మళ్లీ పాజిటివ్

    దక్షిణ కొరియాలో కరోనావైరస్ బారినపడి కోలుకున్న 91 మందిని మళ్లీ పరీక్షించగా వారికి కరోనా పాజిటివ్ నిర్ధరణైందని అక్కడి ఆరోగ్య అధికారులు వెల్లడించారు.

    ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదని కొరియా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(కేసీడీసీ) పేర్కొంది.

    వారికి మళ్లీ సోకడం కాకుండా వారిలో వైరస్ మళ్లీ రీయాక్టివేట్ అయ్యుండొచ్చని కేసీడీసీ డైరెక్టర్ జియాంగ్ యువాన్ కేయాంగ్ అన్నారు.

    వారికి ఇంతకుముందు జరిగిన పరీక్షలు సక్రమంగా చేయకపోయుండొచ్చన అభిప్రాయాలూ నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి.

  5. ఆంధ్రప్రదేశ్‌లో రెడ్ జోన్లు ఇవే..

    ఏపీలో 11 జిల్లాల్లో 133 ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు.

    కరోనా పాజిటివ్ కేసుల్లేని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు మినహా మిగతా 11 జిల్లాల్లోనూ ఈ రెడ్ జోన్లున్నాయి.

    అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 30 జోన్లు ఉండగా, కర్నూలులో 22, కృష్ణాలో 16 రెడ్ జోన్లున్నాయి.

    కోవిడ్-19 పాజిటివ్ కేసులున్న ప్రాంతం నుంచి 3 కిలోమీటర్ల చుట్టూ ఉన్న ప్రాంతాలన్నీ కంటెయిన్మెంట్ క్లస్టర్‌గా పరిగణిస్తారు.

    5 కిలోమీటర్ల పరిధిని బఫర్ జోన్‌గా పరిగణిస్తారు. గ్రామాల్లో అయితే బఫర్ జోన్ 7 కిలోమీటర్ల వరకు ఉంటుంది.

    కంటెయిన్మెంట్ జోన్‌ను కలిపే అన్ని రహదారులు పోలీసుల పర్యవేక్షణలో ఉంటాయి.

    అన్ని ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లలో థర్మల్ స్క్రీనింగ్ చేస్తారు.

  6. ఇంటిన్సెవ్ కేర్ యూనిట్‌లో ఏముంటుంది.. ఎవరికి అవసరం?

    కోవిడ్19 వ్యాప్తి నేపథ్యంలో ఎక్కువగా వినిపిస్తున్న మాటల్లో ‘ఇంటెన్సివ్ కేర్ యూనిట్’ ఒకటి.

    ఇంతకూ ‘ఇంటెన్సివ్ కేర్’ అంటే ఏమిటి? ఇది ఎవరికి అవసరం? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.

  7. ప్రపంచవ్యాప్తంగా 96 వేల మంది కరోనా మృతులు

    ప్రపంచవ్యాప్తంగా 185 దేశాల్లో 16 లక్షలమందికి కరోనావైరస్ సోకింది.

    ఇప్పటివరకు 96 వేల మందికిపైగా మరణించారు.

    పాజిటివ్ కేసుల్లో సగానికిపైగా ఐరోపా దేశాల్లోనే ఉన్నాయి. అమెరికాలో మిగతా అన్ని దేశాల కంటే అధికంగా పాజిటివ్ కేసులున్నాయి.

    జనవరి 25 నుంచి ఏప్రిల్ 10 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ కేసులు, మరణాలు ఎలా పెరిగాయో పై గ్రాఫ్‌లో చూడండి.

  8. కరోనావైరస్‌పై అవగాహన కల్పించేందుకు కాశీబుగ్గ పోలీసుల వినూత్న ప్రచారం

    శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో కాశీబుగ్గ పోలీసులు కరోనావైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వినూత్న ప్రదర్శన చేపట్టారు.

    యమధర్మరాజు, యమ భటులు, చిత్రగుప్తుడు వేషధారులతో ప్రచారం చేయిస్తూ ప్రజలు ఉదాసీనంగా ఉంటే ప్రమాదమంటూ హెచ్చరించారు.

  9. 24 గంటల్లో 37 మరణాలు.. 896 కొత్త కేసులు

    భారత్‌లో గత 24 గంటల్లో 37 మంది కరోనా రోగులు మరణించగా 896 కొత్త కేసులు నమోదయ్యాయి.

    దీంతో మొత్తం మృతుల సంఖ్య 206కి, మొత్తం కేసుల సంఖ్య 6,761కి చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

  10. కోలుకుంటున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

    బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆరోగ్యం గురించి ఆయన బృందం విలేకరులకు వివరించింది.

    కరోనా వైరస్ లక్షణాలు కనిపించిన పది రోజుల తరువాత ఆయన్ను ఆసుపత్రికి తీసుకువెళ్లారని, సోమవారం ఆయన్ను ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేర్చారని తెలిపారు.

    అయితే, గురువారం ఆయన్ను మళ్లీ సాధారణ వార్డుకు మార్చారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగుందని, ఆయన తానున్న సెయింట్ థామస్ హాస్పిటల్ సిబ్బందికి చేయి ఊపి ధన్యవాదాలు కూడా చెప్పారన్నారు.

    అయితే, ప్రధాని బోరిస్ జాన్సన్ మళ్లీ ఎప్పుడు తన విధుల్లోకి వస్తారన్నది స్పష్టం చేయలేదు. వైద్య బృందం సూచన ప్రకారం నిర్ణయం తీసుకుంటారన్నారు.

  11. హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలతో కోవిడ్-19 తగ్గుతుందా

    మలేరియా రోగులకు వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఔషధానికి కరోనావైరస్ వ్యాప్తితో ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది.

    క్లోరోక్విన్‌తోపాటు హైడ్రాక్సీ క్లోరోక్విన్ లాంటి ఔషధాలను ఎవరు వాడుతున్నారు? వీటితో ఫలితాలు వస్తాయా? ఈ వీడియోలో చూడండి.

  12. మే 1 వరకు లాక్‌డౌన్ పొడిగించిన పంజాబ్

    పంజాబ్ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను మే 1 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

    కేంద్రం ప్రకటించిన లాక్‌డౌన్ ఏప్రిల్ 14 వరకు కాగా.. దాన్ని పొడిగించాలంటూ ఇప్పటికే పలు రాష్ట్రాలు కేంద్రాన్ని అభ్యర్థించాయి. ఒడిశా ఇప్పటికే ఆ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 30 వరకు పొడిగించింది. ఇప్పుడు పంజాబ్ కూడా అదే బాటన నడిచింది.

  13. ఇండియాలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు కోటి అవసరం.. 3.28 కోట్లు ఉన్నాయి: కేంద్రం

    భారత్‌లో అవసరాలకు కోటి హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రం అవసరం కాగా ప్రస్తుతం దేశంలో 3.28 కోట్ల మాత్రలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.

  14. వైరస్ సోకడం తగ్గింది.. 16,002 శాంపిళ్లు పరీక్షిస్తే 2 శాతమే పాజిటివ్: కేంద్రం

    గురువారం 16,002 శాంపిళ్లను పరీక్షించగా అందులో 0.2 శాతం పాజిటివ్ కేసులొచ్చాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.

    వైరస్ సోకడం తగ్గుతోందని, ర్యాపిడ్ డయాగ్నస్టిక్ కిట్లు మంజూరు చేశామని చెప్పారు.

  15. న్యూయార్క్‌లో ఏ దేశంలో లేనన్ని కరోనావైరస్ కేసులు

    అమెరికా కాకుండా ఇతర ప్రపంచ దేశాలు అన్నింటికన్నా న్యూయార్క్‌లో అత్యధిక కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి.

    తాజా వివరాల ప్రకారం, ఒక్కరోజులోనే 10 వేల కేసులు నమోదు కావడంతో ఈ రాష్ట్రంలో కోవిడ్ బాధితుల సంఖ్య 1,59,937కు పెరిగింది. ఇది అమెరికా తరువాత స్థానంలో ఉన్న స్పెయిన్‌లోని కోవిడ్ కేసుల కన్నా ఎక్కువ. స్పెయిన్‌లో 1.53 లక్షల కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మూడో స్థానంలో ఉన్న ఇటలీలో 1.43 లక్షల కోవిడ్ బాధితులున్నారు.

    గత ఏడాది చివర్లోనే వైరస్ బారిన పడిన చైనాలో 82,000 కరోనావైరస్ కేసులున్నాయి. అమెరికాలో ఈ సంఖ్య మొత్తంగా 4,66,000 దాటింది.

    కరోనావైరస్ బారిన పడి స్పెయిన్‌లో 15,500, ఇటలీలో 18,000 మంది చనిపోగా, ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలోనే 7 వేలకు పైగా మరణాల నమోదయ్యాయి. చైనా అధికారిక సంఖ్య (3,300) కన్నా ఇది రెట్టింపు.

    న్యూయార్క్ నగరంలో హజ్మత్ సూట్ వేసుకుని శవపేటికలను సామూహికంగా సమాధి చేస్తున్న పోటోలు కూడా వస్తున్నాయి.

    భారీగా గుంతలను తవ్వి వాటిలోకి నిచ్చెనలతో శవపేటికలను దించి సమాధి చేస్తున్న దృశ్యాలను డ్రోన్ కెమేరాలో చిత్రీకరించారు. బ్రాంక్స్‌లోని హార్ట్ ఐలాండ్‌లోని ఈ ప్రదేశాన్ని 150 ఏళ్ళుగా సామూహిక ఖననాలకు ఉపయోగిస్తున్నారు.

    సాధారణంగా, ఈ పనులను రైకర్స్ ఐలాండ్ ఖైదీలతో చేయిస్తుంటారు. అయితే, ఇప్పుడు ఖననాల సంఖ్య బాగా పెరగడంతో ఈ బాధ్యతను కాంట్రాక్టర్లకు అప్పగించారు.

  16. అనంతపురం జిల్లాలో 2 కొత్త కేసులు.. ఏపీలో కోవిడ్ బాధితుల సంఖ్య 365

    ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంట్లో మొత్తం 892 మందికి కరోనావైరస్ పరీక్షలు నిర్వహించారు. వారిలో 17 మందికి కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది.

    నిన్న రాత్రి వరకు చేసిన నమోదైన కేసులకు ఈరోజు కొత్తగా మరో రెండు వచ్చి చేరాయి. ఈ రెండు కేసులూ అనంతపురం జిల్లాలోనే నమోదయ్యాయి.

    ఇప్పటివరకు 10 మంది కోవిడ్ వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఆరుగురు చనిపోయారు. ప్రస్తుతం 349 యాక్టివ్ కేసులకు చికిత్స జరుగుతోందని ఏపీ మీడియా బులెటిన్ వెల్లడించింది.

    మూడు జిల్లాలకు నోడల్‌ అధికారులు

    కరోనా నియంత్రణ, పర్యవేక్షణ కోసం ఏపీ ప్రభుత్వం మూడు జిల్లాలకు నోడల్‌ అధికారులనునియమించింది.

    గుంటూరు జిల్లాకు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి బుడితి రాజశేఖర్‌, తూర్పుగోదావరి జిల్లాకు కాంతిలాల్‌ దండే, అనంతపురం జిల్లాకు విజయానంద్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించింది.

    జిల్లాల్లోని కరోనా నియంత్రణ, పర్యవేక్షణ కంటైన్‌మెంట్‌ బాధ్యతలను వీరికి అప్పగిస్తారు. నోడల్‌ అధికారులు తక్షణమే రిపోర్ట్‌ చేయాలని కూడా ప్రభుత్వం సూచించింది.

  17. ప్రపంచవ్యాప్తంగా 16 లక్షలు, భారత్‌లో 6,412 మంది కోవిడ్ బాధితులు

    ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ బారిన పడినవారి సంఖ్య ఈ ఉదయానికి 16 లక్షలు దాటింది. ఇప్పటివరకు 95,718 మంది కోవిడ్ వ్యాధితో చనిపోయారు. 3,54,972 మంది ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు.

    భారతదేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య 6,412కు చేరింది. ఇప్పటివరకు 199 మంది చనిపోయారు. అయితే, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 504 మంది కోవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నారు.

    ఆంధ్రప్రదేశ్‌లో 363, తెలంగాణలో 471 మంది కోవిడ్ బాధితులకు చికిత్స జరుగుతోంది. తెలంగాణలో గురువారం ఒక వ్యక్తి చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 12కు చేరింది. ఏపీలో ఆరుగురు చనిపోయారు.

    అమెరికాలో 4,66,033 కరోనావైరస్ కేసులు నిర్ధరణ అయ్యాయి. దాదాపు 26 వేల మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. కోవిడ్ వ్యాధితో 16,690 మంది చనిపోయారు.

    కరోనావైరస్ కేసులలో ఇటలీని స్పెయిన్ దాటేసింది. స్పెయిన్‌లో 1,53,222 కేసులు నమోదయ్యాయి. 15,477 మంది చనిపోయారు. అయితే, ఈ దేశంలో వ్యాధి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య మెరుగ్గా ఉంది. ఇప్పటివరకు స్పెయిన్‌లో 52,165 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు.

    ఇటలీలో మృతుల సంఖ్య 18,279కి చేరింది. మొత్తం కేసుల సంఖ్య 1,43,626.

    ఫ్రాన్స్, జర్మనీలలో కూడా కోవిడ్ కేసుల సంఖ్య లక్ష దాటింది.

  18. కరోనావైరస్‌తో పోరాడి గెలిచిన శతాధిక వృద్ధుడు

    కరోనావైరస్ గురించి స్పష్టంగా తెలిసిన ఒక విషయం ఏమిటంటే, అది వృద్ధుల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుందని. కానీ, 101 ఏళ్ళ కీత్ వాట్సన్ ఈ వైరస్‌తో పోరాడి గెలిచారు.

    బ్రిటన్‌లోని వోర్సెస్టర్‌షైర్ నివాసి అయిన కీత్ ఒక శస్త్ర చికిత్స కోసం ఆస్పత్రిలో చేరారు.ఆయనకు తీవ్రమైన జ్వరం రావడంతో వైద్యులు పరీక్షలు చేశారు. ఆ పరీక్షల్లో ఆయనకు కరోనావైరస్ సోకినట్లు తేలింది.

    'ఆయన ఈ వయసులోనూ ఉత్సాహంగా ఉన్నారు' అని కీత్ కోడలు జో వాట్సన్ అన్నారు. కోవిడ్ వ్యాధి నుంచి కోలుకున్న తరువాత కీత్‌ను ఇంటికి తీసుకువెళ్తున్నప్పటి ఫోటోను జో ఫేస్‌బుక్‌లో షేర్ చేసుకున్నారు.

    ఆ ఫోటోకు 500లకు పైగా కామెంట్లు వచ్చాయి. మూడు వేల మంది దాన్ని షేర్ చేశారు.

    కీత్ పూర్తిగా కోలుకుని బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారని జో వాట్సన్ బీబీసీతో చెప్పారు.

    "ఆయనకు కరోనావైరస్ సోకిందని తెలిసినప్పుడు మేం చాలా భయపడ్డాం. రకరకాల ఆలోచనలు మా మనసును కలచివేశాయి. కానీ, ఆయన ఈ వయసులోనూ నిబ్బరంగా ఉన్నారు" అని జో చెప్పారు.

  19. ఐసీయూ నుంచి వార్డుకు వచ్చిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

    బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ఐసీయూ నుంచి బయటకు వచ్చారు. అయితే, లండన్ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స కొనసాగుతుందని వైద్యులు తెలిపారు.

    ప్రభుత్వ సమాచారం ప్రకారం, "జాన్సన్ ఎంతో నమ్మకంగా ఉన్నారు."

    "గత సాయంత్రం జాన్సన్ ఇంటెన్సివ్ కేర్ నుంచి వార్డుకు మాారారు. అక్కడ వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స కొనసాగుతుంది" అని అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.

    అయితే, ప్రధాని మళ్లీ ఎప్పుడు పూర్తి స్థాయిలో విధులకు హాజరు కాబోతున్నారన్నది తెలియలేదు.

    ఈస్టర్ పండుగ వారాంతంలో కరోనావైరస్ లాక్‌డౌన్‌ను నిర్లక్ష్యం చేయకూడదని ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

  20. హలో... కరోనావైరస్ లైవ్ అప్‌డేట్స్ పేజికి తిరిగి స్వాగతం

    కరోనావైరస్‌పై ప్రపంచవ్యాప్తంగా వస్తున్న అప్‌డేట్స్‌ను మీకు ఎప్పటికప్పుడు అందించేందకు బీబీసీ తెలుగు ఈ లైవ్ పేజీ నిర్వహిస్తోంది.

    ఇక్కడ మీరు కరోనావైరస్‌కు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల సమాచారంతో పాటు జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలు ఈ పేజీలో వెంట వెంటనే ప్రత్యక్షమవుతాయి. ఈరోజు ఇప్పటివరకూ అందిన తాజా వార్తా విశేషాలు:

    - బ్రిటన్ ప్రధానమంత్రి బోరిన్ జాన్సన్‌ను ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు తీసుకువచ్చారు. లండన్ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స కొనసాగుతుందని వైద్యులు తెలిపారు.

    - ప్రపంచ ఆరోగ్య సంస్థపై అమెరికా తరువాత తైవాన్ విమర్శలు గుప్పిస్తోంది. మమ్మల్ని ఎంతో కాలంగా అంతర్జాతీయ సంస్థలకు దూరంగా ఉంచుతున్నారని, వివక్ష గురించి మాకన్నా ఎవరికీ ఎక్కువ తెలియదని తైవాన్ అధ్యక్షుడు త్సాయి ఇంగ్-వెన్ విమర్శించారు. డబ్ల్యుహెచ్ఓ అధ్యక్షుడు టెడ్రోస్ అధానోమ్ గెబ్రియెసస్ తనపై వస్తున్న జాతివివక్ష ఆరోపణలు నిరాధారమైనవని అన్నారు.

    - ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ బాధితుల సంఖ్య 16 లక్షలకు చేరుకుంది. గత శుక్రవారం ఈ సంఖ్య 10 లక్షల లోపే ఉండింది. అంటే, ఒక్కవారంలోనే అయిదు లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి.