కేంద్ర బడ్జెట్ 2019: వ్యక్తిగత ఆదాయపు పన్ను శ్లాబుల్లో ఎలాంటి మార్పు లేదు - ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

ఒక మహిళ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం దేశ చరిత్రలో ఇది రెండోసారి. 49 ఏళ్లలో తొలిసారి.

లైవ్ కవరేజీ

  1. ఆదాయ పన్ను స్లాబుల్లో మార్పుల్లేవు

    ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో.. వ్యక్తిగత ఆదాయ పన్నుల స్లాబుల్లో ఎలాంటి మార్పులూ లేవు.

    అయితే.. గృహ రుణం మీద పన్ను మినహాయింపును మరో రూ. 1.5 లక్షలకు పెంచారు.

    అలాగే కొత్తగా విద్యుత్ వాహనాల కొనుగోలు చేయటానికి తీసుకునే రుణం మీదా 1.5 లక్షల వరకూ ఆదాయం మీద పన్ను మినహాయింపు ప్రకటించారు.

    ఇక వార్షికాదాయం ఐదు లక్షల లోపు ఉన్న వారు ఎలాంటి ఆదాయ పన్నూ చెల్లించాల్సిన అవసరం లేదని అల్పాదాయ, మధ్యాదాయ వర్గాల వారికి ఊరటనిచ్చారు.

  2. సంపన్నుల ఆదాయంపై మరింత సర్‌చార్జ్

    అత్యధిక ఆదాయ తరగతిలో ఉన్న వారు మరింత సర్‌చార్జ్ చెల్లించాల్సి ఉంటుంది.

    వార్షికాదాయం రూ. 2 కోట్ల నుంచి 5 కోట్ల వరకూ ఉన్నవారు మూడు శాతం, రూ. 5 కోట్లకు పైన ఆదాయం ఉన్నవారు 7 శాతం సర్‌చార్జ్ చెల్లించాలి.

  3. ఈ ఏడాది ద్రవ్యలోటు 3.3 శాతం

    2017-18లో 3.4 శాతంగా ఉన్న ద్రవ్యలోటు ఈ ఏడాది 3.3 శాతానికి తగ్గింది.

  4. పెట్రోల్, డీజిల్ మీద మరో రూపాయి సెస్

    పెట్రోల్, డీజిల్ మీద ప్రత్యేక అదనపు సుంకం, రహదారి, మౌలికసదుపాయాల సెస్సు.. లీటరుకు ఒక రూపాయి పెంపు

  5. బంగారంపై సుంకం 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంపు

    బంగారంపై కస్టమ్స్ సుంకం 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంపు.

    దిగుమతి చేసుకునే పుస్తకాలపై ఐదు శాతం కస్టమ్స్ సుంకం విధింపు.

    ఆటోమొబైల్ విడిభాగాలు, సింథటిక్ రబ్బర్, పీవీసీ, వినైల్ ఫ్లోరింగ్, టైల్స్ మీద సుంకాలు పెంపు.

    పూర్తి ఆటోమేటెడ్ జీఎస్‌టీ రిఫండ్ విధానాన్ని ప్రారంభిస్తాం.

  6. ఏడాదిలో రూ. కోటి కన్నా ఎక్కువ నగదు విత్‌డ్రా చేస్తే 2 శాతం లెవీ టీడీఎస్

    వాణిజ్య చెల్లింపులను నగదు రూపంలో చెల్లించటాన్ని తగ్గించటానికి.. బ్యాంకు ఖాతా నుంచి ఏడాదికి రూ. ఒక కోటి కన్నా ఎక్కువ నగదు విత్‌డ్రా చేస్తే.. రెండు శాతం లెవీ టీడీఎస్ విధింపు.

    డిజిటల్ ట్రాన్సాక్షన్ చార్జీలను బ్యాంకులు, ఆర్‌బీఐ భరిస్తాయి.

    ఇప్పుడు దేశంలో 120 కోట్ల మందికి ఆధార్ కార్డు ఉంది. పన్ను చెల్లింపుదారుల సౌకర్యం కోసం పాన్, ఆధార్ కార్డులు రెండిటిలో ఏదో ఒకదానిని ఉపయోగించుకోవచ్చు.

  7. పాన్ కార్డు స్థానంలో ఆధార్ కార్డు

    ‘‘124 కోట్ల మంది భారతీయులకు ఆధార్ కార్డులు ఉన్నాయి. పాన్ కార్డు, ఆధార్ కార్డులను మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాం. అంటే.. పాన్ కార్డుకు బదులు ఆధార్ కార్డు వాడుకోవచ్చు. కాబట్టి, పాన్ కార్డు లేకపోయినా ఆధార్ కార్డుతో పన్ను చెల్లించొచ్చు. ఎక్కడెక్కడ పాన్ కార్డు నంబర్ అవసరం అవుతుందో అక్కడక్కడ ఆధార్ కార్డు నంబర్ ఇవ్వొచ్చు’’ అని నిర్మల ప్రకటించారు.

  8. ప్రత్యక్ష పన్నుల రాబడి రూ. 11.37 లక్షల కోట్లు

    2013-14లో 6.38 లక్షల కోట్లుగా ఉన్న ప్రత్యక్ష పన్నుల రాబడి 2018 నాటికి 78 శాతం పెరిగి రూ. 11.37 లక్షల కోట్లకు చేరింది.

    అభివృద్ధికి ఉద్దీపనగా ఉండేలా పన్ను ప్రతిపాదనలు రూపొందించాం.

    పన్ను విధానంలో మరింత పారదర్శకత తీసుకురావటం లక్ష్యంగా పెట్టుకున్నాం.

  9. రూ. 400 వరకూ టర్నోవర్ గల సంస్థలకు కార్పొరేట్ పన్ను 25 శాతమే

    రూ. 400 కోట్ల వరకూ టర్నోవర్ గల కంపెనీల మీద కార్పొరేట్ పన్నును 25 శాతానికి తగ్గిస్తున్నాం.

    ఇప్పటివరకూ రూ. 250 కోట్ల టర్నోవర్ గల కంపెనీలకు మాత్రమే 25 శాతం పన్ను ఉండేది.

    దేశంలో 99.3 శాతం కంపెనీలు ఈ పన్ను పరిధిలోకి వస్తాయి.

    ఆపైన టర్నోవర్ గల సంస్థల మీద 30 శాతం కార్పొరేట్ పన్ను. ఈ తరగతిలో కేవలం 0.7 శాతం కంపెనీలు మాత్రమే ఉంటాయి.

  10. విద్యుత్ వాహనాలు కొంటే అదనంగా ఆదాయ పన్ను మినహాయింపు

    విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసిన వారికి అదనంగా రూ. 1.5 లక్షల ఆదాయం మీద పన్ను మినహాయింపు.

    గృహ రుణాలపైనా అదనంగా రూ. 1.5 లక్షల ఆదాయంపై పన్ను మినహాయింపు

  11. రూ. ఐదు లక్షల లోపు ఆదాయం ఉన్న వారిపై ఆదాయ పన్ను లేదు

    వార్షికాదాయం రూ. 5 లక్షల కన్నా తక్కువ ఉన్న వారి మీద ఆదాయ పన్ను లేదు. ఎలాంటి ఆదాయ పన్నూ చెల్లించాల్సిన అవసరం లేదు.

  12. పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ. 1,05,000 కోట్లు

    2019-20 ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం 1,05,000 కోట్లు.

    ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ ప్రభుత్వ ప్రాధాన్యం.

    ఎయిర్ ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణను పున:ప్రారంభిస్తాం.

  13. ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 70,000 కోట్లు

    బ్యాంకింగ్ రంగం ప్రక్షాళనకు కట్టుబడి ఉన్నాం. ఆరు ప్రభుత్వ రంగ బ్యాంకులను రుణ సంక్షోభం నుంచి గట్టెక్కించాం.

    రుణ పరపతి పెంచటం కోసం ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 70,000 కోట్లు అందిస్తాం.

    అపరిచిత నగదు జమ నియంత్రణకు ప్రత్యేక విధానం అమలు చేస్తాం.

  14. స్వయం సహాయక బృందాల మహిళలకు రూ. లక్ష వరకూ రుణం

    స్వయం సహాయ బృందాలలో ఒక్కొక్క మహిళల రూ. 1 లక్ష వరకూ ముద్రా రుణం అందిస్తాం. ఈ మహిళలకు ‘జన్ ధన్’ ఖాతాను కూడా అందిస్తాం. ఈ బృందాలను అన్ని జిల్లాలకూ విస్తరిస్తాం.

    ప్రతి రంగంలో మహిళల కృషి చాలా గణనీయంగా ఉంది. ఇటీవలి ఎన్నికల్లో మహిళల భాగస్వామ్యం రికార్డు స్థాయిలో.. పురుషులతో సమానంగా ఉంది. ఈ సభలో రికార్డు స్థాయిలో 78 మంది మహిళా ఎంపీలు కూడా ఉన్నారు.

    ‘నారీ నుంచి నారాయణి’ - మహిళ పాత్రను ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

    మహిళల ప్రగతిని మెరుగుపరచటానికి చర్యలను సూచించటానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నాం.

  15. 17 నగరాలు ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి

    పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయటానికి దేశంలోని 17 విశిష్ట నగరాలను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తాం.

    భారత పాస్‌పోర్టు ఉండి విదేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులకు ఆధార్ కార్డ్ ఇస్తాం.

  16. ఒక్క రెక్కతో పక్షి ఎగరలేదు.. మహిళల భాగస్వామ్యం లేకుండా సమాజం అభివృద్ధి చెందదు

    ఒక్క రెక్కతో పక్షి ఎగరలేదు.. మహిళల భాగస్వామ్యం లేకుండా సమాజం అభివృద్ధి చెందదు మహిళల గురించి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ‘‘మహిళల స్థితిగతుల్ని బాగు చేయకుండా ప్రపంచం అభివృద్ధి చెందదు. ఒక రెక్కతో పక్షి ఎగరడం సాధ్యం కాదు అని స్వామి వివేకానంద చెప్పారు. మహిళల మెరుగైన భాగస్వామ్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మహిళల పాత్రను ప్రోత్సహిస్తుంది’’ అని చెప్పారు.

    Lok Sabha TV

    ఫొటో సోర్స్, Lok Sabha TV

  17. ఎల్ఈడీ బల్బులతో ప్రతి ఏటా రూ. 18,345 కోట్లు ఆదా

    తమ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 35 కోట్ల ఎల్ఈడీ బల్బులను ఏర్పాటు చేసిందని, పాతతరం బల్బుల స్థానంలో సీఎల్ఎఫ్ బల్బుల్ని పెట్టామని తద్వారా దేశానికి 18,345 కోట్ల రూపాయలు ప్రతి ఏటా ఆదా అవుతున్నాయని నిర్మలా సీతారామన్ చెప్పారు.

  18. కార్మిక చట్టాలన్నీ నాలుగు ప్రాధమిక కార్మిక స్మృతులుగా సరళీకరణ

    కార్మిక చట్టాలను నాలుగు ప్రాధమిక కార్మిక స్మృతులుగా సరళీకరిస్తాం.

    సామాజిక సంక్షేమ లక్ష్యాల కోసం పనిచేస్తున్న సామాజిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలను లిస్ట్ చేయటానికి ఎలక్ట్రానిక్ ఫండ్‌రైజింగ్ ప్లాట్‌ఫామ్ – సోషల్ స్టాక్ ఎక్సేంజ్‌ను నెలకొల్పుతాం.

  19. ఆస్పైర్ కింద 75,000 మంది నైపుణ్య పారిశ్రామికవేత్తల అభివృద్ధి

    2019-20లో వ్యవసాయ – గ్రామీణ పరిశ్రమ రంగంలో 75,000 మంది నైపుణ్య పారిశ్రామికవేత్తలను అభివృద్ధి చేయటానికి 80 లైవ్‌లీహుడ్ బిజినెస్ ఇంక్యుబేటర్లు, 20 టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్లు నెలకొల్పుతాం.

    ఫిషరీస్ రంగంలో మౌలిక సదుపాయాల లోపాలను పరిష్కరించటానికి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అమలు చేస్తాం.

  20. పరిశోధనల కోసం నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ స్థాపన

    భారతదేశంలో పరిశోధనను సమన్వయం చేయటానికి నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ నెలకొల్పుతాం.

    2014లో మన టెక్నలాజికల్ ఇన్‌స్టిట్యూట్‌లు ఏవీ టాప్ 200 జాబితాలో లేవు. ఇప్పుడు ఆ జాబితాలో మూడు ఇన్‌స్టిట్యూట్‌లు ఉన్నాయి.

    విద్యాబోధన ప్రమాణాలను పెంచటానికి, జ్ఞాన్ కార్యక్రమాన్ని ప్రారంభించాం. సవాళ్లను ఎదుర్కోవటానికి అది మార్గదర్శక ప్రణాళిక.

    భారతదేశం త్వరలో ఉన్నత విద్యకు కేంద్రంగా మారుతుంది. విదేశీ విద్యార్థులను రప్పించటానికి ‘స్టడీ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం.