రోహిత్ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌తో సహా ఐదుగురు క్రికెటర్లు ఐసొలేషన్‌‌కు

ప్రచురణ

నాలుగు టెస్టుల సీరీస్ కోసం ఆస్ట్రేలియా వెళ్లిన భారత క్రికెటర్లలో ఐదుగురిని ముందు జాగ్రత్త చర్యగా ఐసోలేషన్‌కు తరలించారు.

రోహిత్ శర్మ, శుభ్‌మన్‌ గిల్, పృథ్వీ షా, రిషభ్‌ పంత్, నవదీప్‌ సైనీలు మెల్‌బోర్న్‌లోని ఒక రెస్టరెంట్‌లో తింటూ ఉండగా తీసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.వీరు ఐదుగురూ కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారా లేదా అనే అంశంపై ఇరు జట్లూ దర్యాప్తు చేస్తున్నాయి.

వీరిని ఐసొలేషన్‌లో ఉంచినప్పటికీ ట్రైనింగ్‌ కోసం అందుబాటులో ఉంటారు.

నాలుగు టెస్టుల సీరీస్‌లో ముగిసిన రెండు టెస్టుల్లో భారత్ ఒకటి, ఆస్ట్రేలియా ఒకటి గెలిచాయి. మూడో టెస్ట్ జనవరి 6న ప్రారంభం కానుంది. రెండవ మ్యాచ్ జరిగిన మెల్‌బోర్న్‌లో క్రికెటర్లు, ఇతర సిబ్బంది హోటల్‌ నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతి ఉంది. ఏదైనా రెస్టరెంట్‌కు వెళితే లోపల కాకుండా బాహ్య వాతావరణంలో కూర్చుని భోజనం చేయాల్సి ఉంటుంది. కానీ వీరు ఐదుగురు లోపల కూర్చుని తింటున్నట్లు ఆ వీడియోలో ఉంది.

భారత క్రికెట్ అభిమాని ఒకరు ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు."బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా కూడా ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్నాయి. వీరు కోవిడ్ 19 నిబంధనలను ఉల్లంఘించారా లేదా అనే విషయాన్ని త్వరలోనే నిర్థరిస్తాం" అని క్రికెట్ ఆస్ట్రేలియా ఒక ప్రకటన విడుదల చేసింది.ముందు జాగ్రత్త చర్యగా ఐదుగురినీ ఐసొలేషన్‌లో ఉండాలని భారత, ఆస్ట్రేలియా వైద్య బృందాలు కోరాయి. శిక్షణ, ప్రయాణ సమయాల్లో వీరు మిగతా ఆటగాళ్లకు దూరంగా ఉంటారు. మూడవ టెస్ట్ సిడ్నీలో జరగనుంది. 14 రోజుల క్వారంటీన్ తరువాత రోహిత్ శర్మ మూడవ టెస్ట్ ఆడడానికి వచ్చాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)