కమలా హారిస్: 'మా ఊరి బిడ్డ... మమ్మల్ని చూడడానికి వస్తుంది'

ప్రచురణ

అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్ తల్లి పుట్టిన ఊరిలో పండగ వాతావరణ చోటు చేసుకుంది. తమిళనాడులోని తులసేంద్రపురంలో కమలా హారిస్ తాతగారు జన్మించారు. ఎక్కువగా రైతులు, రైతు కూలీలే ఉన్న ఆ ఊరి జనాభా 8 వేలు. ఆ ఊరిలో ఆదివారం తెల్లవారగానే సందడి మొదలైంది.

జో బైడెన్, కమలా హారిస్ గెలిచారనే వార్త రాగానే ఆ గ్రామ ప్రజలు అక్కడి గుడిలో పూజలు జరిపారు. స్వీట్లు పంచి పెట్టారు. బాణసంచా కాల్చారు. కొంతమంది మహిళలు కమలా హారిస్‌ను అభినందిస్తూ తమ వాకిళ్ళలో అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారు. యువతీ యువకులు ఎంతో గర్వంగా ఆమె పోస్టర్లు ప్రదర్శించారు. వాళ్లందరి కళ్లలో విజయోత్సాహం. ఉదయం గుడిలో పూజకు గంట మోగగానే మహిళలు గుంపులు గుంపులుగా వెళ్లి పూజలు చేశారు. కమలా హారిస్ పూర్వీకుల కుటుంబ దైవానికి ప్రసాదాలు సమర్పించారు.

చుట్టుపక్కల ఉన్న దాదాపు 120 గ్రామాల ప్రజలు, స్థానిక రాజకీయ నాయకులు ఆలయ పూజలకు హాజరయ్యారు. ఉపాధ్యక్ష పదవిని చేపట్టిన తరువాత కమల తమ ఊరిని చూడడానికి వస్తుందని వారు ఆశిస్తున్నారు. ఆ ఆలయ నవీకరణకు ఆమె తాతగారు విరాళాలు ఇచ్చిన సంగతిని కొందరు గుర్తు చేశారు.

తులసేంద్రపురం కౌన్సిలర్ అరుల్ మోళి సుధాకర్ భారత్, అమెరికా రాజకీయాలలో మహిళల పాత్ర గురించి మాట్లాడారు. "భారతదేశంలో ఇందిరా గాంధీ, జయలలిత వంటి మహిళా నేతలు ఉండేవారు. ఇప్పుడు భారత సంతతికి చెందిన ఒక మహిళ అమెరికాలో చరిత్ర సృష్టించారు. అది మాకు ఎంతో ఆనందం కలిగిస్తోంది" అని ఆయన అన్నారు.

"ఒక మహిళా నాయకురాలిగా నేను ఈ భారత కుగ్రామంలో ఉన్నప్పటికీ, మహిళలు ఈ రంగంలో పైకి రావడం ఎంత కష్టమో నాకు తెలుసు. మా ఊరి బిడ్డ ఇప్పుడు అమెరికా చరిత్రను తిరగరాశారు" అని ఆమె అన్నారు.

తమిళనాడు రాష్ట్ర మంత్రి ఆర్. కామరాజ్ కూడా తులసేంద్రపురంలో పూజలు నిర్వహించారు. 'ఈ చిన్న పల్లెటూరుకు చెందిన ఒక మహిళ అమెరికాలో అంతటి ఉన్నత స్థానానికి చేరుకోవడం మాకు గర్వకారణం' అని ఆయన అన్నారని ఏఎన్ఐ తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)