పాకిస్తాన్‌లో హిందూ ఆలయ నిర్మాణం... వ్యతిరేకంగా మదర్సా ఫత్వా

ప్రచురణ

ఇస్లామాబాద్‌లో సుమారు 3వేల మంది హిందువులు నివసిస్తున్నారు. ఎన్నో ఏళ్ల డిమాండ్ తర్వాత ఇటీవలే ప్రభుత్వం వారికి తమ మతాచారాలను నిర్వహించుకునేందుకు, ఓ ఆలయ నిర్మాణానికి ఇస్లామాబాద్‌లో 20వేల చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించింది. అయితే ముస్లిం రాజ్యంలో కొత్తగా ఆలయ నిర్మాణాలు చేపట్టకూడదంటూ స్థానిక మత పెద్దలు ఫత్వా జారీ చేశారు.

ఇస్లామాబాద్‌లో మొదటిసారిగా హిందూ ఆలయ నిర్మాణానికి కొన్నాళ్ల క్రితం స్థలాన్ని కేటాయించింది ఇస్లామాబాద్ నగర అభివృద్ధి ప్రాధికారిక సంస్థ. అయితే ప్రస్తుతం ఆ ఆలయ నిర్మాణానికి పెద్ద చిక్కు వచ్చి పడింది. స్థానికంగా పేరున్న జామియా అషఫ్రియా మదర్సా.. ఈ ఆలయ నిర్మాణం విషయంలో ఫత్వా జారీ చేసింది. అదే సమయంలో స్థానిక న్యాయవాది కూడా ఆలయ నిర్మాణాన్ని తక్షణం నిలిపేయాలంటూ ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

జూన్ 23వ తేదీన హ్యూమన్ రైట్స్ పార్లమెంటరీ సెక్రటరీ లాల్ చంద్ మలి.. ఆలయ నిర్మాణానికి కేటాయించిన స్థలంలో భూమి పూజ నిర్వహించారు. ఆ కార్యక్రమం చాలా నిరాడంబంరంగా జరిగింది.

సుమారు 20 వేల చదరపు అడుగుల స్థలాన్ని 2017లో స్థానిక హిందూ సంఘానికి అప్పగించారు. అయితే పరిపాలన సంబంధమైన సమస్యల కారణంగా ఆలయ నిర్మాణం ఆలస్యమయ్యింది. ప్రస్తుతం ప్రభుత్వం ఆ స్థలాన్ని హిందూ సంఘానికి పూర్తిగా అప్పగించింది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆలయం మొదటి విడత నిర్మాణానికి పది కోట్ల రూపాయల(ప్రస్తుత భారతీయ కరెన్సీ ప్రకారం రూ.4.5కోట్లు సుమారు) నిధులను కూడా ఇస్తానని హామీ ఇచ్చారు.

“ఇస్లామాబాద్‌లో మొట్ట మొదటి ఆలయం.. ప్రభుత్వం ఆలయ నిర్మాణానికి 4 కెనల్స్(సుమారు20,000 చదరపు అడుగులు) స్థలాన్ని కేటాయించింది. లాంగ్ లివ్ పాకిస్తాన్” అని లాల్ చంద్ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)