ప్రభుత్వ కార్యక్రమంలో హిందూ పూజారి 'భూమిపూజ'పై డీఎంకే ఎంపీ సీరియస్

వీడియో క్యాప్షన్, ప్రభుత్వ కార్యక్రమంలో హిందూ పూజారి 'భూమిపూజ'పై డీఎంకే ఎంపీ సీరియస్
ప్రచురణ

తమిళనాడు ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఒక భూమి పూజ కార్యక్రమంలో హిందూ పూజారి మాత్రమే ఉండటం వివాదానికి దారి తీసింది.

ధర్మపురి జిల్లాలోని ఆలంపురం గ్రామంలో ఒక చెరువు పునరుద్ధరణ పనుల కోసం పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్(పీడబ్ల్యూడీ) ఆధ్వర్యంలో భూమి పూజ చేపట్టారు. ఆ కార్యక్రమానికి డీఎంకే పార్టీకి చెందిన ధర్మపురి ఎంపీ ఎస్.సెంథిల్ కుమార్ కూడా వచ్చారు.

భూమి పూజ కార్యక్రమంలో హిందూ పూజారి మాత్రమే ఉండటం మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమంలో పూజలు ఎలా చేస్తారంటూ పీడబ్ల్యూడీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌ను ఆయన ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

'ప్రభుత్వ కార్యక్రమంలో పూజలు ఎందుకు చేయిస్తున్నారు? ప్రభుత్వ పనుల్లో మతపరమైన కార్యక్రమాలు చేపట్టకూడదని చెప్పారు కదా? ఒకవేళ చేయిస్తే మిగతా మతాల వాళ్లు ఏరి? నాస్తికులు, క్రైస్తవులు, ముస్లింలు, ఇతర మతాలు వారు కూడా ఉండాలి కదా? ద్రవిడార్ కజగం ప్రతినిధులు, ఫాదర్, ఇమామ్‌లను కూడా పిలిపించండి' అంటూ సెంథిల్ కుమార్ అధికారి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు.

ద్రవిడార్ కజగం అనేది ఒక హేతువాద సంస్థ. దీన్ని పెరియార్ రామస్వామి ప్రారంభించారు. దీని నుంచే డీఎంకే(ద్రవిడ మున్నేట్ర కజగం) పార్టీ పుట్టుకొచ్చింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)