Amarnath యాత్రలో బీజేపీ ఎమ్మెల్యే Raja Singh: ‘నేను, నా కుటుంబం సేఫ్.. కళ్లముందే టెంట్లు అన్నీ కొట్టుకుపోయాయి’

వీడియో క్యాప్షన్, అమర్‌నాథ్ యాత్రలో ఎమ్మెల్యే రాజాసింగ్: ‘నా కళ్లముందే వాళ్ల టెంట్లన్నీ కొట్టుకుపోయాయి’
ప్రచురణ

అమర్‌నాథ్ గుహ సమీపంలో క్లౌడ్ బరస్ట్ కారణంగా ఇప్పటివరకు 16 మంది చనిపోయారని, సుమారు 40 మంది గల్లంతయ్యారని ఏఎన్‌‌ఐ తెలిపింది.

కొండచరియలు విరిగిపడిన ఘటనలు లేవని, వర్షం పడుతూనే ఉందిగానీ, సహాయక చర్యలకు ఆటంకం లేదని ఎన్‌డీఆర్ఎఫ్ డీజీ అతుల్ కర్వల్ తెలిపినట్టు ఏఎన్ఐ వెల్లడించింది.

నాలుగు NDRF బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయని, భారత ఆర్మీ, SDRF, CRPF, ఇతర బృందాలు కూడా సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నాయని డీజీ తెలిపారు.

కాగా, తెలంగాణ గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు రాజా సింగ్‌ కూడా అమర్‌నాథ్ యాత్రలో ఉన్నారు. ప్రమాదం జరిగినప్పుడు తాను అక్కడే ఉన్నానని చెప్పారు.

తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్
ఫొటో క్యాప్షన్, తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్

‘‘తెలంగాణ ప్రజలు, హిందువుల ఆశీర్వాదం వల్ల నేనూ, నా కుటుంబం అమర్‌నాథ్ యాత్ర పూర్తి చేసుకుని, శ్రీనగర్‌కు తిరిగి వచ్చాం. నిన్న నేను అక్కడే ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నా. ఇలాంటి పరిస్థితిని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. భారీ వరద వచ్చింది. టెంట్లు అన్నీ కొట్టుకుపోయాయి. మేం భోజనం చేసిన ప్రాంతం కూడా సర్వనాశనం అయిపోయింది.

మేం కూర్చుని కొంతమందితో మాట్లాడామో అది కూడా కొట్టుకుపోయింది. గుడి ప్రాంగణం కిందే వేల సంఖ్యలో టెంట్లు ఉన్నాయి. అక్కడే కొందరు రాత్రిపూట విశ్రాంతి తీసుకుంటున్నారు. మరికొందరు టెంట్లలో అన్నదానం చేస్తున్నారు. అక్కడ వాతావరణం చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది. అవన్నీ కొట్టుకుపోయాయి. నా జీవితంలో ఇలాంటి వరదను నేను చూడలేదు. సైనికులు చాలామంచి పనిచేశారు. చాలామందిని కాపాడారు. ప్రతి 10 అడుగులకు ఒక సైనికుడు ఉన్నారు. వాళ్లవల్లే ఎక్కువ ప్రాణహాని జరగలేదు. వాళ్లే భక్తులను ముందుగానే హెచ్చరించారు’’ అని రాజాసింగ్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)