ఈ నత్తలు తెచ్చిన వారికి రూ. 12 కోట్ల జాక్‌పాట్ కొట్టే లాటరీ టికెట్లు ఫ్రీ

ప్రచురణ

కేరళలో పెద్ద సైజులో ఉండే జెయింట్ ఆఫ్రికన్ నత్తలు బెడదగా తయారయ్యాయి. రైతుల పంటలను నాశనం చేస్తూ వారి ఆదాయానికి గండికొడుతున్నాయి.

దీంతో ఒక గ్రామంలో టాప్ టెన్ స్నెయిల్ కాచర్స్‌కు లాటరీ టికెట్లు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు పంచాయితీ పెద్దలు.

ఎక్కువ సంఖ్యలో నత్తలను పట్టుకున్న మొదటి 10 మంది రైతులకు లాటరీ టికెట్లు లభిస్తాయి. వారి టికెట్ లాటరీ గెల్చుకుంటే 12 కోట్ల రూపాయలు వారి సొంతమవుతాయి.

అత్యంత హానికర జీవజాతులలో భారీ సైజుండే ఆఫ్రికన్ నత్తలు కూడా ఒకటి.

‘‘నత్తలు మొత్తం మొక్కనే తినేస్తాయి. మనం మళ్లీ మొక్కలు నాటినా అవి మళ్లీ నాశనం చేస్తాయి. మీ ఇంట్లో నత్తలను మాత్రమే పట్టుకుంటే సరిపోదు. చుట్టుపక్కల రోడ్లపైన, పాత ఇళ్ల దగ్గర ఉన్న నత్తలను కూడా పట్టుకోవాలని నేను అందరితో చెబుతుంటాను. ఒక్క నత్త వెయ్యి గుడ్లు పెడుతుంది. అందుకే దీనికి అంతమనేదే లేకుండా పోయింది’’ అని సంతప్పన్ అనే రైతు చెప్పారు.

అందుకే దొరికినన్ని నత్తలను పట్టుకుని వాటిని ఉప్పు నీటిలో పడేసి చంపేయాలని గ్రామ పంచాయితీ పెద్దలు చెబుతున్నారు.

మొక్కల్లో ఉండే కాల్షియంతోనే అవి బతుకుతాయని చెబుతున్నారు నిపుణులు.

ఇవి ఇళ్లను కూడా పాడుచేస్తాయి. ప్రజలను రోగాల బారిన పడేస్తాయి.

‘‘నత్తలపై ఉండే దళసరి పెంకు కోసం దానికి పెద్ద మొత్తంలో కాల్షియం అవసరం. అందుకే ఇవి ఎక్కువగా సిమెంటు, ఇసుకపై ఆధారపడుతుంటాయి’’ అని కేరళ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన డాక్టర్ టీ వీ సజీవ్ సజీవ్ చెప్పారు.

సుమారు 25 ఏళ్ల క్రితం శాస్త్రవేత్తలు ఈ నత్తలను కేరళకు తీసుకొచ్చారు.

అప్పట్లో వాటిని సరైన పద్దతిలో విడిచిపెట్టలేదని చెబుతున్నారు నిపుణులు.

కానీ వాటి దాడి తీవ్రతను మాత్రం అదుపుచేయగలిగారు.

అయితే ఇప్పుడు ప్రమాదకరంగా మారిన ఈ నత్త వేరే జాతిది అయి ఉండొచ్చని అంటున్నారు .

నత్తల దాడి అధికంగా ఉండే మియన్మార్ నుంచి వచ్చిన కలప దుంగల ద్వారా వీటి రాక మొదలైందని సజీవ్ తెలిపారు.

లాటరీ స్కీమ్ అనేది ఈ నత్తల బెడదను కట్టడి చేసేందుకు పంచాయితీ పెద్దలు చేస్తున్న ప్రయోగం. ఈ పోటీ పూర్తయ్యే వరకు సంతప్పన్ వంటి రైతులు తమ వేటను కొనసాగిస్తూనే ఉంటారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)