ఊదా దేవి: 36 మంది బ్రిటిష్ సైనికులను చంపి తన భర్త మరణానికి ప్రతీకారం తీర్చుకున్న దళిత మహిళ

ప్రచురణ

చరిత్రపుటల్లో ఆమె పేరు కనిపించకపోయినా ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూ నగర పరిసరాల్లోని చాలా గ్రామాల్లో.. ఆమె ధైర్యం గురించి ఇప్పటికీ చెప్పుకొంటుంటారు.

దళిత కుటుంబం నుంచి వచ్చిన ఊదా దేవి, లఖ్‌నవూ నవాబ్‌ వజీద్‌ అలీ షా భార్య బేగమ్ హజ్రత్‌ మహల్‌కు భద్రత కల్పించేవారు. ఊదా దేవి భర్త మక్కా పాసీ.. నవాబ్‌ సైన్యంలో సైనికుడు.బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా భారత్‌లో మొదటి తిరుగుబాటు 1857లో జరిగింది. బ్రిటిష్‌వారు అప్పటికే లఖ్‌నవూ నవాబ్ వజీద్‌ అలీ షాను కలకత్తాకు వెళ్లిపోయేలా చేశారు. దీంతో ఆయన భార్య బేగమ్‌ హజ్రత్‌ మహల్‌.. బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా జెండా చేతబట్టారు. లఖ్‌నవూ సమీపంలోని చిన్హాత్‌ దగ్గర నవాబ్‌ సైన్యం, బ్రిటిష్‌ సైన్యం తలపడ్డాయి. ఆ యుద్ధంలో ఊదా దేవి భర్త మక్కా పాసీ చనిపోయారు.

తన భర్త బ్రిటిష్‌ వారి చేతిలో చనిపోవడంతో నిరుత్సాహపడిన ఊదా దేవి, ప్రతీకారం ఎలా తీర్చుకున్నారు? ఊదా దేవి పాసీ వర్గానికి చెందినవారు. తన సాహసాలతో ఊదా దేవి ఎంతో మందిని నిశ్చేష్టులను చేశారని, ఇతరులకు స్ఫూర్తిగా నిలిచారని చాలామంది సామాజికవేత్తలు చెబుతుంటారు. ఊదా దేవి చనిపోవడానికి ముందు ఆమె 36 మంది బ్రిటిష్‌ సైనికులను హతమార్చారు. ఆమె చూపించిన ధైర్యసాహసాలు ఇప్పటికీ జానపద గీతాల్లో వినిపిస్తుంటాయి. కానీ ఇంతటి సాహసాన్ని ప్రదర్శించిన ఊదా దేవి పేరు కాలంతోపాటు కనుమరుగైపోయింది.

ఊదా దేవి లాంటి మహిళలకు చరిత్ర పుస్తకాల్లో స్థానం దక్కలేదు. కానీ అగ్రవర్ణాలుగా చెప్పే కులాల ఆధిపత్యం ఉన్న రంగాల్లో ఊదా దేవి చూపిన తెగువ, త్యాగం- ఆమె లాంటి అట్టడుగువర్గాల మహిళలకు స్ఫూర్తిని కలిగిస్తున్నాయి.

ఊదా దేవి చరిత్ర భారత స్వతంత్ర పోరాటంలో దళితులు, మహిళలు పోషించిన పాత్రను, దాని ప్రాధాన్యాన్ని చాటి చెబుతుంది. స్వతంత్ర భారతంలో సాధారణ మహిళల పాత్రను ఆమె కథ మనకు గుర్తుచేస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)