విశాఖ: సీలేరు నదిలో ఆరు మృతదేహాలు లభ్యం.. ఇంకా లభించని మరో ఇద్దరి ఆచూకీ

ప్రచురణ

విశాఖ జిల్లా సీలేరు నదిలో రెండు నాటు పడవలు మునిగిన ఘటనలో మరో మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరిని రాణి(6) అనిశరణ్ (1) , శాంసన్(1)గా గుర్తించినట్లు సీలేరు పోలీసులు తెలిపారు.

అంతకు ముందు అభిర్ ఖారా (1), గాయత్రి(4), అనూష(3)ల మృతదేహాలు లభించినట్లు సీలేరు ఎస్సై రంజిత్ తెలిపారు.

ఈ ప్రమాదంలో ముగ్గురు క్షేమంగా ఒడ్డుకు చేరుకోగా, మరో ఇద్దరు లక్ష్మీఖారా(22), పింకీ ఖారా (4) ఆచూకీ ఇంత వరకు లభ్యం కాలేదు.

బాధితులంతా ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లాకు చెందిన గిరిజనులు. మొత్తం 11 మందిలో ముగ్గురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగలిగారు.

హైదరాబాద్‌కు కూలీలుగా వెళ్లిన గిరిజనులు అక్కడ లాక్‌డౌన్‌ విధించడంతో తిరిగి స్వగ్రామాలకు బయల్దేరారు.

రోడ్డుమార్గాన ఒడిశా వెళ్తే, అడ్డుకుంటారేమోనని భయపడిన కూలీలు అడ్డదారిన సీలేరు కంపెనీ కాలువ దగ్గరకు చేరుకున్నారు.

సోమవారం అర్ధరాత్రి 11 మంది గిరిజనులు రెండు నాటు పడవల్లో ఒడిశాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

మొదట బయలుదేరిన నాటు పడవ మునిగిపోవడంతో దానిలో ఉన్న గిరిజనులు కొందరు, వెనుక వస్తున్న రెండో పడవను పట్టుకున్నారు. దాంతో అది కూడా మునిగిపోయింది.

రెండు పడవల్లో ఉన్న వాళ్ళందరూ మునిగిపోగా, ముగ్గురు మాత్రం ఈదుతూ ఒడ్డుకు చేరుకోగలిగారు.

మొత్తం ఎనిమిది మంది గల్లంతవగా, వీరిలో ఒక చిన్నారి మృతదేహం మంగళవారం ఉదయం లభించింది.

ఈ ఘటనపై పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి బీబీసీతో మాట్లాడారు. "మొత్తం ఎనిమిది మంది గల్లంతైయ్యారని బాధిత కుటుంబాలు చెబుతున్నాయి. సీలేరు జెన్‌కో అధికారులతో మాట్లాడాను. ప్రమాదం గురించి తెలుసుకున్నాను. సహాయ చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవోలను కోరాను" అని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)