కడప జిల్లా ముగ్గురాళ్ల గనుల పేలుడు కేసులో వైఎస్ ప్రతాపరెడ్డి అరెస్ట్ - Newsreel

ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

కడప జిల్లా మామిళ్లపల్లె ముగ్గురాళ్ల గనుల్లో 10 మంది మృతికి కారణమైన పేలుడు కేసులో పోలీసులు కీలక వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. నిబంధనలు ఉల్లంఘించారంటూ వైఎస్‌ కుటుంబానికి చెందిన ప్రతాప్‌రెడ్డిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు.

గనిలో ఉపయోగించే జిలెటన్‌ స్టిక్స్‌ పులివెందుల నుంచి కలసపాడు వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో పులివెందులలో వైఎస్‌ ప్రతాప్‌రెడ్డికి చెందిన మ్యాగజైన్‌ లైసెన్స్‌ నుంచి జిలెటన్‌ స్టిక్స్‌ తరలించినట్లు తేల్చారు. ఎలాంటి భద్రతాపరమైన చర్యలు చేపట్టకుండా తరలించారంటూ ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు.

కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి ప్రతాప్‌రెడ్డి పెదనాన్న. ఆయనకు పులివెందుల, సింహాద్రిపురం, లింగాల పరిసర ప్రాంతాల్లో గనులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పేలుడుకు వినియోగించే జిలెటిన్‌ స్టిక్స్‌కు మ్యాగజైన్‌ లైసెన్స్‌ ప్రతాప్‌రెడ్డికి ఉంది. ఈ క్రమంలో పులివెందుల నుంచి మామిళ్లపల్లె గనులకు జిలెటన్‌ స్టిక్స్‌ తరలించి అక్కడ అన్‌లోడ్ చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10 మంది కూలీలు మృతిచెందారు. ఈ కేసులో ఇప్పటికే గని యజమాని నాగేశ్వర్‌రెడ్డితో పాటు మరొకరిని కూడా అరెస్ట్‌ చేశారు.

రష్యాలోని పాఠశాలలో కాల్పులు.. 9 మంది మృతి

రష్యాలోని ఒక పాఠశాలలో జరిగిన కాల్పులలో 8 మంది పిల్లలు, ఒక టీచర్ ప్రాణాలు కోల్పోయారని అక్కడి మీడియా వెల్లడించింది.

రాజధాని మాస్కోకు 820 కిలోమీటర్ల దూరంలోని కజాన్ నగరంలో ఈ ఘటన జరిగింది.

ఇద్దరు సాయుధులు కాల్పులు జరిపారని.. వారిలో ఒక 17 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని స్థానిక మీడియా చెబుతోంది.

కజాన్ నగరం తతార్‌స్థాన్ ముస్లిం రిపబ్లిక్‌లో ఉంది.

డ్రైవ్ ఇన్ వ్యాక్సినేషన్ సెంటర్స్: కారు దిగకుండా వ్యాక్సీన్ వేయించుకుంటున్నారు

ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో 'డ్రైవ్ ఇన్' వ్యాక్సినేషన్ సెంటర్‌లు నిర్వహిస్తున్నారు.

45 ఏళ్లు దాటిన వారు సెకండ్ డోస్ వ్యాక్సీన్ కోసం ఈ కేంద్రాలకు వచ్చి కారు దిగకుండానే టీకా వేయించుకోవచ్చు.

ఇప్పటికే కొన్ని ఇలాంటి కేంద్రాలు నిర్వహిస్తుండగా మంగళవారం మరో మూడు కేంద్రాలను ప్రారంభించినట్లు భువనేశ్వర్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రేమ్ చంద్ చౌధరి తెలిపారు.

ఏపీ నుంచి వస్తున్న అంబులెన్సులు ఎందుకు ఆపారు.. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న

ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న అంబులెన్సులను తెలంగాణ సరిహద్దులలో నిలిపివేస్తుండడంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.

ఇలాంటి విపత్కర సమయంలో మానవత్వం లేకుండా అంబులెన్సులు ఆపేయడం ఏమిటని ప్రశ్నించింది.

ఏ అధికారంతో అంబులెన్సులను రానివ్వకుండా అడ్డుకున్నారని ప్రశ్నించింది.

మరోవైపు తెలంగాణలో కరోనావైరస్ వ్యాప్తి నియంత్రణకు చేపడుతున్న చర్యలపైనా కోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది.

సామూహిక ప్రార్థనలలో కరోనా నిబంధనలు అమలు కావడం లేదని కోర్టు అభిప్రాయపడింది.

రంజాన్ తరువాత చర్యలు చేపట్టాలని అనుకుంటున్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

తెలంగాణలో రాత్రి పూట కర్ఫ్యూ ప్రకటించినా అది సక్రమంగా అమలు కావడం లేదని కోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది.

కోర్టు ఆదేశాలను పక్కనపెడితే ధిక్కరణ చర్యలు తప్పవని హెచ్చరించింది.

కాగా ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గంతో సమావేశమవుతున్నారని.. నైట్‌కర్ఫ్యూ పొడిగింపు, లాక్‌డౌన్ వంటి అంశాలపై నిర్ణయం తీసుకుంటారని ఏజీ కోర్టుకు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)