‘‘కలెక్టర్ కుర్చీలో కూర్చోగానే... ఆ స్థానం నాదే అనిపించింది’’ - ఒక్క రోజు కలెక్టర్ శ్రావణి

ప్రచురణ

ఇటీవల మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఈ బాలిక పేరు శ్రావణి. అనంతపురం జిల్లాకు చెందిన ఈ బాలిక జిల్లాకు ఒకరోజు పాటు కలెక్టర్‌గా పనిచేసింది.

అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఈమెకు ఈ అవకాశం లభించింది.

ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న శ్రావణి.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఓ బాధిత బాలికకు 25 వేల రూపాయల పరిహారం అందించే ఫైల్‌పై కలెక్టర్ హోదాలో సంతకం చేసింది.

అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు 'అమ్మాయే భవిష్యత్తు' పేరుతో ఓ కార్యక్రమం ప్రారంభించారు.

అందులో భాగంగా, జిల్లా, మండల, గ్రామస్థాయి కార్యాలయాల్లో బాలికలను ఒక్కరోజు శాఖాధిపతులుగా నియమించారు.

జిల్లాలోని వివిధ స్కూళ్లు, కాలేజీల్లోని విద్యార్థినులను లాటరీ ద్వారా ఎంపిక చేసి, వారికి ప్రభుత్వాధికారులుగా ఒక్కరోజు పనిచేసే అవకాశం కల్పించారు.

గార్లదిన్నెలోని కస్తూర్బాగాంధీ విమెన్స్ కాలేజీలో చదివే శ్రావణికి కలెక్టర్‌గా పనిచేసే అవకాశం లభించింది.

శ్రావణి తల్లిదండ్రులు రోజు కూలీలు. ఇంటర్ పూర్తయ్యాక మెడిసిన్ చదవాలన్న కోరికని, పేదరికం కారణంగా విరమించుకుని, ఒక సైన్స్ టీచర్‌గా స్థిరపడాలని శ్రావణి అనుకుంటోంది. బాల్యవివాహాలు అమ్మాయిల చదువుకు అడ్డంకిగా మారాయని శ్రావణి అంటోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)