అమెరికాలో 70 ఏళ్లలో తొలిసారిగా ఓ మహిళకు మరణశిక్ష...

ప్రచురణ

దాదాపు 70 ఏళ్ల తర్వాత అమెరికాలో ఓ మహిళకు మరణశిక్ష అమలుచేయబోతున్నారు. ఫెడరల్ జైల్లోని మహిళా ఖైదీ లీసామోంట్‌గోమరీకి డిసెంబర్ 8న విషపు ఇంజెక్షన్ ఇచ్చి మరణ శిక్ష అమలు చేస్తున్నట్లు అమెరికా న్యాయ శాఖ వెల్లడించింది.

లీసామోంట్‌గోమరీ 2004లో ఓ గర్భిణిని గొంతు పిసికి చంపి, ఆమె గర్భాన్ని కోసి బిడ్డను ఎత్తుకెళ్లారు. శిశువును కిడ్నాప్ చేయడంతో పాటు, మహిళ మరణానికి కారణమయ్యారంటూ 2007లో జ్యూరీ.. మోంట్‌గోమరీని దోషిగా గుర్తించింది. ఆమెకు మరణశిక్ష విధించాలని సిఫార్సు చేసింది.

అమెరికా ఫెడరల్ కోర్టు ఇంతకు ముందు చివరిసారిగా 1953లో బోనీ హీడీ అనే మహిళకు మరణ శిక్ష విధించింది. అప్పుడు ఆమెను మిస్సోరీలోని ఒక గ్యాస్ చాంబర్‌లో పెట్టి మరణశిక్ష అమలు చేశారు.

1999లో ఇద్దరు యువ మంత్రులను హత్య చేసిన బ్రాండన్ బెర్నార్డ్‌కు కూడా ఈ డిసెంబర్‌లో మరణశిక్ష విధించనున్నారు.

మోంట్‌గోమరీ, బ్రాండన్ బెర్నార్డ్ ఘోరమైన హత్యలు చేశారని అమెరికా అటార్నీ జనరల్ విలియం బార్ అన్నారు. ఫెడరల్ కోర్టు మరణశిక్షలను తిరిగి ప్రారంభించవచ్చని న్యాయశాఖకు గత ఏడాది ట్రంప్ ప్రభుత్వం సూచించింది.

మోంట్‌గోమరీ ఎవరు?

మోంట్‌గోమరీ 2004 డిసెంబరులో ఓ కుక్కపిల్లను కొనేందుకు కన్సాస్ నుంచి మిస్సోరీలోని బాబీ జో స్టినెట్ ఇంటికి వెళ్లారని న్యాయ శాఖ ఒక పత్రికా ప్రకటనలో చెప్పింది.

“మోంట్‌గోమరీ ఆ ఇంట్లోకి వెళ్లగానే స్టినెట్ గొంతు నులిమారు. అప్పటికి ఎనిమిది నెలల గర్భంతో ఉన్న బాధితురాలు స్పృహ తప్పారు. తర్వాత ఆమె వంటగదిలోని కత్తితో స్టినెట్ కడుపును కోశారు. దాంతో స్టినెట్‌కు మళ్లీ స్పృహ వచ్చింది. ఇద్దరి మధ్యా కాసేపు పెనుగులాట జరిగింది. తర్వాత మోంట్‌గోమరీ గొంతు కోసి స్టినెట్‌ను చంపి, ఆమె గర్భం నుంచి బిడ్డను తీసి ఎత్తుకెళ్లిపోయారు. ఆ బిడ్డను తన సొంత బిడ్డగా పెంచుకునేందుకు ఆమె ప్రయత్నించారు” అని ఆ ప్రకటనలో చెప్పారు.

అయితే, చిన్నతనంలో దెబ్బలు తినడం వల్ల ఆమె మెదడుకు గాయమైందని, దాంతో మానసికంగా బలహీనంగా ఉన్నారని చెబుతూ మరణశిక్ష రద్దు చేయాలని మోంట్‌గోమరీ లాయర్లు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)