మన్ కీ బాత్: బొమ్మలపై కాదు విద్యార్థుల పరీక్షలపై చర్చించండి.. - మోదీపై రాహుల్ గాంధీ విమర్శలు

ప్రచురణ
చదివే సమయం: 2 నిమిషాలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నిర్వహించిన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు చేశారు.

“జేఈఈ-నీట్ విద్యార్థులు పరీక్షలపై ప్రధాని మాట్లాడాలని కోరుకుంటున్నారు. కానీ, ఆయన మాత్రం బొమ్మల గురించి చర్చించారు” అని రాహుల్ ట్వీట్ చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మోదీ ఆదివారం తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

ఆ సమయంలో ఆయన స్వదేశీ బొమ్మల తయారీ గురించి మాట్లాడారు. గ్లోబల్ టాయ్ ఇండస్ట్రీ విలువ 7 లక్షల కోట్ల రూపాయలకు పైనే ఉందన్నారు. కానీ అంత పెద్ద వ్యాపారంలో భారత్ భాగస్వామ్యం చాలా తక్కువగా ఉందన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని కొండపల్లిలో బొమ్మలు తయారుచేయడం గురించీ మోదీ ప్రస్తావించారు.

మన దేశంలో ఐడియాస్, కాన్సెప్ట్స్ ఉన్నాయన్న ప్రధాని, భారత్‌లో గేమ్స్ తయారుచేయాలని యువతకు పిలుపునిచ్చారు.

వర్చువల్ గేమ్స్, బొమ్మల తయారీ రంగంలో భారత్ చాలా కీలక పాత్ర పోషించాలని, దేశంలో అందరూ ‘లోకల్ టాయ్స్ కోసం వోకల్’ కావాల్సిన సమయం వచ్చిందని అన్నారు.

జేఈఈ-నీట్ పరీక్షలపై విపక్షాల వ్యతిరేకత

జేఈఈ-నీట్ పరీక్షల గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రసంగంలో ఎక్కడా ప్రస్తావించలేదు. మరోవైపు రాహుల్ గాంధీ మాత్రం విద్యార్థులు ప్రధాని పరీక్షల గురించి మాట్లాడాలని కోరుకున్నారని చెప్పారు.

నిజానికి సెప్టెంబర్ 1న జేఈఈ పరీక్ష జరగబోతోంది. తర్వాత సెప్టెంబర్ 13న నీట్ పరీక్ష ఉంది. దేశంలో కరోనావైరస్ కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతుండడంతో ఈ పరీక్షల గురించి చాలా మంది విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ పరీక్షలను వాయిదా వేయాలని చాలా రోజులుగా డిమాండ్లు వస్తున్నాయి. ఈ పరీక్షలను ఇంతకుముందు కూడా రెండు సార్లు వాయిదా వేశారు.

కానీ ఈసారీ ప్రభుత్వం పరీక్షలు వాయిదా వేయడానికి అనుకూలంగా లేదు. ఈ విషయం సుప్రీంకోర్టుకు కూడా వెళ్లింది. కానీ, దానివల్ల విద్యార్థులు తమ పూర్తి సంవత్సరాన్ని నష్టపోతారని, కోర్టు పరీక్షలు వాయిదా వేయాలనే పిటిషన్‌ను తోసిపుచ్చింది.

కోవిడ్-19 సమయంలో కూడా మన జీవితాలు నడుస్తూ ఉండాలన్న న్యాయస్థానం మేం పరీక్షలను అడ్డుకోలేమని, మనం ముందుకు నడవాల్సి ఉంటుందని చెప్పింది.

అయితే ఆ తర్వాత కూడా ఆరు రాష్ట్రాలు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)