తమిళనాడు పోలీసు కస్టడీ మరణాలపై ప్రజాగ్రహం

వీడియో క్యాప్షన్, తమిళనాడు పోలీసు కస్టడీ మరణాలపై ప్రజాగ్రహం
ప్రచురణ

తమిళనాడులో పోలీస్ కస్టడీలో ఉన్న తండ్రీకొడుకులు మరణించడంపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది.

పి.జయరాజ్ (58), ఆయన కుమారుడు ఫెనిక్స్(38)లను లాక్‌డౌన్ నిబంధనల ప్రకారం మూసివేయాల్సిన సమయం తరువాత కూడా దుకాణం తెరిచే ఉంచారన్న కారణంతో పోలీసులు అరెస్ట్ చేశారు.

వీరు రెండు రోజులు పోలీస్ కస్టడీలో ఉన్నారు.. ఆ సమయంలో ఒకరి తరువాత ఒకరు మరణించారు.

ఈ సంఘటనపై తమిళనాడు రాష్ట్రమంతటా తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. దాంతో , రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదప్పాడి కె. పళనిసామి ఆదివారం ఒక ప్రకటన చేస్తూ, హైకోర్టు అనుమతిస్తే దీనిపై సీబీఐ విచారణ జరిపిస్తామని అన్నారు.

జూన్ 19న ఏం జరిగిందంటే

షాపులు మూయంచేందుకు పోలీసులు వచ్చినప్పుడు ఫెనిక్స్‌కు, వారికి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఫెనిక్స్‌, ఆయన తండ్రి జయరాజ్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. జయరాజ్‌ను పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లారు.వారి వెనకే ఫెనిక్స్ కూడా స్టేషన్‌కు వెళ్లారు. జయరాజ్‌ను, ఫెనిక్స్‌ను పోలీసులు స్టేషన్‌లోని సెల్‌లో బంధించారు.

పోలీసుల ఎఫ్ఐఆర్ ప్రకారం, లాక్‌డౌన్‌లో అనుమతించిన సమయం దాటాక కూడా నడుస్తున్న షాపులను మూయించేందుకు పోలీసులు వెళ్లినప్పుడు జయరాజ్, ఫెనిక్స్, వారి మిత్రులు కొందరు వారి దుకాణం ముందు నిల్చొని ఉన్నారు. వారిని ఇళ్లకు వెళ్లిపోవాలని పోలీసులు సూచించారు. కానీ, వారు పోలీసులనే తిట్టారు. పోలీసుల విధులకు అడ్డుపడ్డారు. పోలీసు అధికారిని చంపేస్తామని కూడా వారు బెదిరించినట్లు ఎఫ్ఐఆర్‌లో ఉంది.

జయరాజ్, ఫెనిక్స్‌లపై 188, 269, 294(బీ), 353, 506 (2) సెక్షన్ల కింద కేసు నమోదైంది. జూన్ 21న వాళ్లిద్దరినీ కోవిల్‌పట్టి సబ్ జైలుకు పంపించారు. జయరాజ్, ఫెనిక్స్ కిందపడ్డారని, వాళ్లకు అంతర్గత గాయాలయ్యాయని కూడా ఎఫ్ఐఆర్‌లో ఉంది. కోవిల్‌పట్టి ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం రాత్రి ఫెనిక్స్ మరణించారు. మంగళవారం ఉదయం జయరాజ్ ప్రాణాలు కోల్పోయారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)