‘గల్వాన్ లోయ భారత్‌దే.. మా తాత పేరు మీదే దానికి ఆ పేరు వచ్చింది’ - BBC Exclusive

ప్రచురణ

'మా తాతగారు గులాం రసూల్ గల్వాన్ పేరు మీద ఆ ప్రాంతానికి గల్వాన్ అనే పేరు వచ్చింది' అని గులాం రసూల్ గల్వాన్ మునిమనవడు మహ్మద్ గల్వాన్ చెప్పారు.

భారత్-చైనా దేశాల మధ్య గల్వాన్ లోయలో ఘర్షణలు తలెత్తాయి. ఈ లోయ తమదేనని చైనా వాదిస్తుండగా, ఆ వాదనను భారత్ కొట్టిపారేసింది.

ఈ నేపథ్యంలో అసలు గల్వాన్ ఎవరు? ఈ లోయకు ఆ పేరు ఎలా వచ్చింది? అనే అంశంపై లద్దాఖ్‌లోని లేహ్ నుంచి మహ్మద్ గల్వాన్‌తో మాట్లాడారు బీబీసీ ప్రతినిధి అమీర్ పీర్జాదా.

''భారత్-చైనా 1962లో కూడా గల్వాన్ కోసం యుద్ధం చేశాయి. మన సైనికుల వాళ్లను తరిమికొట్టారు. ఈసారి కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ సారి కూడా చైనా దీన్ని ఆక్రమించాలని ప్రయత్నిస్తోంది. మన సైనికులు ఇప్పటికీ అక్కడ ఉన్నారు, 20 మంది చనిపోయారన్నది అందరికీ తెలిసింది. వారికి మా సెల్యూట్'' అని మహ్మద్ గల్వాన్ చెప్పారు.

అమీర్: గులాం రసూల్ గల్వాన్ ఒక గైడ్ అని చెప్పారు. ఆయన ఎవరితో వెళ్లేవారు. దేని గురించి చెప్పేవారు?

మహ్మద్ గల్వాన్: బ్రిటిష్ పాలనలో గులాం రసూల్ గల్వాన్ భారత్‌లో ఉన్న బ్రిటిష్ వారికి గైడ్‌గా పనిచేశారు. చైనా, తుర్క్‌మెనిస్తాన్, టిబెట్ ప్రాంతాలకు వెళ్లాలనుకునే బ్రిటిష్ వారికి ఆయన గైడ్ చేసేవారు. అప్పటి నుంచే దానికి ఆయన పేరు పెట్టారు.

అమీర్: మీరు చూపించిన ఈ సర్వెంట్ ఆఫ్ సాహెబ్స్ పుస్తకం ఎవరు రాసారు. ఇందులో ఏమేం చెప్పారు?

మహ్మద్ గల్వాన్: బ్రిటిష్ వారితో ఉన్నప్పుడు గులాం రసూల్ గల్వాన్‌కు ఇంగ్లిష్‌లో రాయాలని చాలా కోరిక కలిగింది. దాంతో, ఆయన ఆంగ్లేయుల దగ్గర కొంత ఇంగ్లిష్ నేర్చుకున్నారు. తర్వాత సర్వెంట్ ఆఫ్ సాహెబ్స్ అనే ఈ పుస్తకం రాశారు. తర్వాత 1953లో అది లండన్‌లో ప్రింట్ అయ్యింది. ఇటీవల 1995లో నేను దీన్ని రీప్రింట్ చేశాను.

అమీర్: భారత ప్రజలు నివసించే చివరి గ్రామం షయోక్ నుంచి ఎల్ఏసీ (లైన్‌ఆఫ్ యాక్చువల్ కంట్రోల్)కి ఎంత దూరంలో ఉంది?

మహ్మద్ గల్వాన్: లేహ్ నుంచి గల్వాన్ లోయ వరకూ 200 కిలోమీటర్లు ఉంటుంది. అంటే షయోక్ గ్రామం ఎల్ఏసీకి 30 లేదా 40 కిలోమీట్లు ఉంటంది.

అమీర్: బ్రిటిష్ ఇండియాలో చివరి గ్రామం షయోక్ నుంచి ఎల్ఏసీకి దాదాపు 40 కిలోమీటర్లు అంటున్నారు. అక్కడి వరకూ మంచి రోడ్డు సౌకర్యం ఉందా?

మహ్మద్ గల్వాన్: భారత్ దాని కోసం చాలా ప్రయత్నిస్తోంది. అక్కడి వరకూ చేరుకుంది కూడా. ఇప్పుడు ఆ రోడ్డు గురించే అక్కడ అంత గొడవ జరుగుతోంది.

అమీర్: 'సర్వెంట్ ఆఫ్ సాహెబ్స్'పుస్తకం గురించి చెబుతారా, దీనిని గులాం రసూల్ గల్వాన్ స్వయంగా రాశారా?

మహ్మద్ గల్వాన్: ఈ పుస్తకాన్ని గులామ్ రసూల్ గల్వాన్ స్వయంగా రాశారు. చట్టబద్ధమైన వారసుడుగా దీన్ని నేను 1995లో రీప్రింట్ చేశాను.

అమీర్: గల్వాన్ లోయ ఇప్పుడు అంతర్జాతీయంగా అందరికీ తెలుసు. మీ తాతగారి పేరునే దీనికి పెట్టారు. ఇప్పుడు దీనిపై ఇంత ఘర్షణ జరుగుతుంటే మీకు వ్యక్తిగతంగా ఎలా అనిపిస్తోంది?

మహ్మద్ గల్వాన్: మా తాతగారి పేరున ఏర్పడిన ఇది భారత్‌కే చెందుతుంది. మన సైనికులు వాళ్లను లోపలికి రానివ్వరు. వచ్చినా తరిమికొడతాం.

ఇక్కడ లద్దాఖీలు కూడా పాకిస్తాన్ యుద్ధంలో భారత్ తరఫున పాల్గొన్నారు. ఇప్పుడు కూడా చైనా ఏదైనా చేస్తే, లద్దాఖీలు యుద్ధానికి వెళ్లడానికి రెడీగా ఉన్నారు.

అమీర్: ఇప్పుడు ఇక్కడ వాస్తవ పరిస్థితిని గమనిస్తే.. భారత్-చైనా దేశాల సైనికుల మధ్య రెండు ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. వాటిలో ఒకటైన ప్యాంగ్యాంగ్ లేహ్ నుంచి 160 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక గల్వాన్ 250 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)