తిరుమల సహా ఆలయాల్లో దర్శనాలకు ఏర్పాట్లు

వీడియో క్యాప్షన్, తిరుమల వెంకన్న దర్శనానికి మార్గదర్శకాలు
ప్రచురణ

లాక్‌డౌన్ ఆంక్షలను క్రమంగా సడలిస్తున్న ప్రభుత్వం ఆలయాలను తెరవటానికి అనుమతులు ఇచ్చింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు ఏపీలోని అన్ని ప్రధాన ఆలయాల్లోనూ దర్శనాల క్యూలైన్లలో భౌతికదూరం పాటించడం, తలనీలాలు సమర్పించే సందర్భంలోనూ, అన్న ప్రసాదం విషయంలోనూ అనేక మార్పులకు రంగం సిద్ధమవుతోంది.

అన్ని ఆలయాల్లోనూ సన్నద్ధంగా ఉండాలని ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. తాజాగా వివిధ దేవాలయాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి కూడా అందుకు అనుగుణంగా పలు సూచనలు చేశారు.

సహజంగా ప్రతీ ఏడాది మార్చి నుంచి జూన్ వరకూ ఆలయాలకు ఎక్కువ సంఖ్యలో యాత్రికులు తరలివస్తూ ఉంటారు. టీటీడీ సహా అన్ని ఆలయాల సందర్శకుల సంఖ్య ఆ విషయాన్ని స్పష్టం చేస్తోంది. టీటీడీ అధికార లెక్కల ప్రకారం 2019లో సగటున రోజుకి 76,411 మంది దర్శనాలు చేసుకున్నారు. అదే మే, జూన్ నెలల్లో అయితే ఆ సంఖ్య 85 వేల వరకూ ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, అన్నవరం, కాణిపాకం, సింహాచలం, ద్వారకా తిరుమల, శ్రీశైలం వంటి ఆలయాల్లో కూడా అదే రీతిలో భక్తుల తాకిడి ఎక్కువగా కనిపించేది. వేసవి సెలవులు కావడంతో పాటుగా ఇతర అనేక కారణాలవల్ల సాధారణంగా ఈ సీజన్‌లో ఆలయాలు కిటకిటలాడిపోతూ ఉండేవి.

సుదీర్ఘ విరామం తర్వాత ఆలయాల్లో దర్శనాలకు మళ్లీ అనుమతించబోతున్న తరుణంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున నియంత్రణ అవసరం అని భావిస్తున్నారు. దానికి తగ్గట్టుగా టీటీడీ ముందుగా చిత్తూరు జిల్లా వాసుల వరకూ అనుమతించబోతున్నట్టు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)