వీడియో: అంతరించిపోతున్న అరుదైన హైదరాబాదీ కళ

ప్రచురణ

రిపోర్ట్: సంగీతం ప్రభాకర్, కెమెరా: నవీన్ కుమార్ కె

నిజాం పాలనలో ఎంతో క్రేజ్ ఉన్న ఈ హైదరాబాదీ ఆర్ట్ అంతరించిపోతోంది.

‘‘మేము ఈ కళను బ్రతికించడానికి పెద్ద వాళ్ళకు వారి చిత్రాలను నగిషీ చేసి ఇస్తున్నాము. ఈ కళను బ్రతికించడానికి ఏమైనా సహకారం వస్తుందనే ఆశతోనే అలా చేస్తున్నాం. కానీ మేము కూడా ఎంత వరకు చేయగలం? మా తరంతోనే ఈ కళ ఆగిపోతుందేమో’’...నగిషీ చెక్కడం అపి, ఇదంతా చెప్పి మళ్ళీ తన పనిలో నిమగ్నమయ్యారు మొహమ్మద్ అబ్దుల్ వాసిఫ్. హైదరాబాద్ తపాచబుత్ర నివాసి అబ్దుల్ వాసిఫ్ ఈ కళను చేస్తున్న నాల్గవ తరం కళాకారుడు.

అద్భుతమైన చరిత్ర

లోహాలపై నగిషీలు చెక్కే ఈ కళకు ప్రత్యేక చరిత్ర ఉంది. ఈ కళాకారుల మొదటి తరం మొహమ్మద్ అహ్మద్, అబ్దుల్ కరీమ్ నిజాం ప్రభుత్వ కరెన్సీ డిజైన్, రాజముద్రలు, ఆయుధాలపై నగిషీలు రూపొందించేవారు. అంతే కాకుండా అప్పటి ప్రముఖులకు వారి ముద్ర ఉండేలా రకరకాల డిజైన్లున్న షేర్వాణీ గుండీలను రూపొందించేవాళ్ళు.

రెండవ ప్రపంచ యుద్ధంపై రూపొందించిన కళాకృతితో వీరి మూడవ తరం కళాకారుడు షబ్బీర్ అహ్మద్ కి ఛీఫ్ డిజైనర్ ఉద్యోగం ఇచ్చింది ప్రభుత్వం.

మొదట్లో వీరు బంగారు,వెండి రేకులపై దేసిన్లు చెక్కేవాళ్ళు. ఇప్పుడు జర్మన్ సిల్వర్ రేకుపై నల్లని పొడి పూత పూసి చెక్కుతున్నారు.

ఒక్కో డిజైన్ చెక్కడానికి వీరికి దాదాపు నెల రోజుల సమయం పడుతుంది.

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సహా ఎందరో ప్రముఖులనుండి వీరు ప్రశంసలు అందుకున్నారు.

కాలం గడుస్తున్నకొద్దీ ఆదరణ తగ్గటంతో తమ ముందు తరం ఎవరూ ఈ కళను నేర్చుకోవడానికి సిద్ధంగా లేరని. తాము కూడా బతుకుదెరువు కోసం రేడియం స్టిక్కరింగ్, ఫ్లెక్స్ ప్రింటింగ్ వంటి పనులు చేస్తున్నామని, గత ఎండాకాలంలో కూలర్లు అమ్మామని చెప్పారు వాసిఫ్.

‘‘నేను నా చిన్నప్పటినుండి చూస్తున్నా.. మా నాన్న ఈ కళను బ్రతికించడానికి అన్నివిధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఆర్డర్స్ రావట్లేదు. దీంతో చాలా కష్టపడుతున్నారు. చాలా కాలంనుండి పెద్దవాళ్ల చిత్రాలను చెక్కి వారికి బహుమతిగా ఇవ్వడం తప్ప ఆర్డర్స్ రావట్లేదు. అందుకే నేను ఈ కళపై ఆధారపడకుండా ఇంజినీరింగ్ చేస్తున్నా’’ అని చెప్పారు వాసిఫ్ కొడుకు అహ్మద్ మొహియుద్దీన్.

మూడవ తరం కళాకారుడు, ఛీఫ్ డిజైనర్‌గా పదవి విరమణ పొందిన షబ్బీర్ అహ్మద్ 1975 లో తనకు ఆర్మీ వారు ఇచ్చిన ప్రశంసాపత్రాన్ని చూపిస్తూ.. ‘‘బతకడానికి వేరే పని చేయాల్సి వస్తోంది. మనం ఏం చేయగలం? ప్రపంచంతో పాటు వెళ్లాలి కదా’’ అన్నారు. ఈ కళ అంతరిచిపోతుంటే మీకెలా అనిపిస్తోంది? అన్న ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం అది.

మాకు ఒకవేళ మళ్ళీ పనులు రావడం మొదలైతే మా ముందుతరం వారంతట వారే ఈ కళను నేర్చుకోవడానికి ఇష్టపడతారని నేను నమ్ముతా అని ఆశాభావం వ్యక్తం చేసారు వాసిఫ్.

ఖురాన్ చెక్కడమే లక్ష్యం

‘‘ఖురాన్ లో ౩౦ అధ్యాయాలలో ఉంటాయి. అందులో 2 అధ్యాయాలను నగిషీలుగా చెక్కాము. మొత్తం పూర్తి చేయడానికి మాకు నాలుగైదు సంవత్సరాలు పడుతుంది. ఖురాన్ ని చెక్కాలనేది మా నాన్న కోరిక. దాన్ని మేము ఎలాగైనా పూర్తిచేస్తాము. మా కళ ఉన్నా లేకపోయినా మేము చెక్కిన ఖురాన్ చరిత్రలో నిలిచిపోతుంది’’ అంటూ తాము చెక్కిన రెండు అధ్యాయాలను చూపించారు వాసిఫ్.

మా కళ బ్రతుకుతుందనే ఆశ

‘‘ఈ కళ ప్రసిద్ధి చెంది ప్రపంచమంతా తెలుసుకోవాలి. మోడరన్ ఆర్ట్, కాన్వాస్ ఆర్ట్ కి లభించినంత ఆదరణ ఈ ప్రాచీన కళకి లభిస్తుందని నా నమ్మకం. ఒక వేళ ఆన్ లైన్, ఈ కామర్స్ సంస్థల నుండి సహకారం లభించి, తెలంగాణ ప్రభుత్వం తోడ్పాటు అందిస్తే ప్రపంచానికి ఈ కళ తెలుస్తుంది. అంతేకాదు మన పురాతన కళ జీవించి, మన రాష్ట్రానికి మంచి పేరు తెస్తుంది’’ అని అన్నాడాయన.

వాసిఫ్ మాతో మాట్లాడినంత సేపు తమ ఈ కళ అంతరించిపోదని, ఎలాగైనా ముందుతరాలకు వెళ్లి జీవించి ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)